రోడ్డుమీద పదిరూపాయలు కనపడితే ఎవరూ చూడకుండా జేబులో పెట్టుకునేవాళ్లు చాలామంది ఉంటారు. కానీ ఎవరైనా అది పడేసుకున్నారేమో, వారికి తిరిగిచ్చేద్దాం అనుకునేవారు చాలా అరుదు. అలాంటిది ఏకంగా లక్షన్నర రూపాయలు దొరికితే ఎవరైనా వదిలేస్తారా. ఎవరి కంటా పడకుంటా ఇంటికి తీసుకెళ్తారు. కానీ ఆ ఆటోడ్రైవర్ మాత్రం అలాంటి పని చేయలేదు. పోగొట్టుకున్నవారి కోసం చూశాడు, కనపడకపోయే సరికి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి ఇచ్చేశాడు.
తన కుమార్తె పెండ్లికి సంబంధించిన డబ్బుతో పాటు పెండ్లి కార్డులు తీసుకుని ఆటోలో వెళ్తున్న ఓ వ్యక్తి బ్యాగును మరిచిపోయాడు. ఆటో డ్రైవర్ నిజాయితీతో ఆ బ్యాగును తిరిగి అప్పగించాడు. ఈ సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ధూల్పేట ప్రాంతానికి చెందిన రామ్రాజ్ తివారీ పూజారి. అతడి కుమార్తె వివాహం కుదిరింది. సోమవారం కుమార్తె పెండ్లి కార్డుతోపాటు పెండ్లికి అవసరమైన రూ.1.5 లక్షల నగదును తీసుకుని బంజారాహిల్స్లోని ఓ గుడిలో పూజలు చేయించేందుకు షేక్పేట మీదుగా ఆటోలో బయలుదేరాడు. బంజారాహిల్స్ రోడ్ నం. 12లో ఆటో దిగిన రామ్రాజ్ తివారీ తన వెంట తెచ్చుకున్న బ్యాగును ఆటోలో మరిచిపోయి వెళ్లిపోయాడు.
ఆటోలో బ్యాగు ఉన్న విషయాన్ని గుర్తించిన ఆటో డ్రైవర్ హుస్సేన్ కొద్దిసేపు పరిసరాల్లో రామ్రాజ్ తివారీ కోసం వెతికాడు. అతడు కనిపించకపోవడంతో బంజారాహిల్స్ పోలీస్స్టేషన్కు వెళ్లాడు. ఎస్ఐ ఉదయ్కుమార్కు బ్యాగును అప్పగించాడు. కాగా, తన బ్యాగు పోయిందంటూ ఫిర్యాదు చేసేందుకు రామ్రాజ్ తివారీ కూడా పోలీసు స్టేషన్కు వచ్చాడు. ఆటో డ్రైవర్ హుస్సేన్ చేతుల మీదుగా బ్యాగును అప్పగించారు. ఆటోడ్రైవర్ నిజాయితీని బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ శివచంద్ర, ఎస్ఐలు ఉదయ్, అజయ్కుమార్ అభినందించారు.