భర్త చేతిలో వేధింపులు, గృహ హింస, వరకట్నం కోసం దాడి.. ఇలాంటివన్నీ సామాన్య మహిళలు చేసే ఫిర్యాదులు. అయితే ఇప్పుడు ఏకంగా ఒక ఐపీఎస్ అధికారి తన భర్త తనను వేధిస్తున్నాడని, అదనపు కట్నం కోసం హింసిస్తున్నాడని కేసు పెట్టింది. ఆ భర్త కూడా సాదాసీదా అధికారి కాదు. భారత విదేశాంగశాఖలో ఇండియన్ ఫారిన్ సర్వీస్ లో పని చేస్తున్నాడు.
ప్రస్తుతం బెంగుళూరులో పనిచేస్తున్న ఐపీఎస్ ఆఫీసర్ వర్తికా కటియార్. భర్తపై గృహ హింస, వరకట్నం కేసులు పెట్టింది. 2011లో నితిన్ సుభాష్ అనే ఐఎఫ్ఎస్ అధికారితో తన పెళ్ళి జరిగిందని ఫిర్యాదులో పేర్కొంది. అప్పటి నుంచి భర్త, ఆయన కుటుంబసభ్యులు తన వద్ద నుంచి బంగారు ఆభరణాలు తీసేసుకున్నారని, తనను అకారణంగా దూషిస్తూ మానసిక హింసకు గురి చేసేవారని చెప్పింది. పెళ్ళయిన మూడు నెలల తర్వాత అదనపు కట్నం కావాలంటూ వేధించారని పేర్కొంది. మూడు లక్షలు అర్జంటుగా ఇవ్వకపోతే విడాకులు ఇస్తానని బెదిరించారని, వెంటనే మూడు లక్షలు ట్రాన్సఫర్ చేశానని చెప్పింది. మళ్ళీ తన భర్త ఉత్తరప్రదేశ్ లోని తన తల్లి ఇంటికి వెళ్ళి ఐదు లక్షలు అప్పుగా తీసుకున్నాడని, ఆ విషయం తెలిసి ఆ డబ్బు తిరిగి తన తల్లిదండ్రులకు ఇచ్చి వేయాలని చెప్పానని తెలిపింది. అయితే ఆయన ఇచ్చిన చెక్ చెల్లుబాటు కాలేదని పేర్కొంది.
తన భర్త మద్యానికి అలవాటు పడ్డాడని, తాను ఎంత చెప్పినా వినకుండా భౌతికంగా దాడి చేసేవాడని, ఒకసారి తన చేయి కూడా విరిచేశాడని ఫిర్యాదులో పేర్కొంది. 2016లో కొలంబోకు వెళ్ళిన సమయంలో తన తల పగలగొట్టాడని ఇలాగే పలు దఫాలు తనపై దాడి చేసి కొట్టినట్లు చెప్పింది. తన భర్త, అత్తమామలు, ఆయన సోదరులు మరో 35 లక్షల రూపాయలు తీసుకురావాలంటూ వేధిస్తున్నారని తెలిపింది. ఈ ఆరోపణలతో ఆమె బెంగుళూరు కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది.
https://ndnnews.in/101husbandkilledwife2monthsaftermarraige/