కొత్త సంవత్సరం ఏయే వస్తువుల రేట్లు పెరుగుతాయో ఇప్పుడే ఓ అంచనాకు రాలేం. కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలోనే ఆ సంగతి బయటపడుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం కొత్త ఏడాది బంగారం ధరలు భారీగా పెరిగే సంకేతాలున్నాయి. 10గ్రాముల బంగారం రూ.55 వేలకు చేరుకుంటుందని చెబుతున్నారు నిపుణులు. కరోనా న్యూవేరియంట్ ఒమిక్రాన్ భయాలు.. ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు.. అమెరికా డాలర్ బలోపేతం వంటి అంశాల వల్ల ఈ పెరుగుదల ఉంటుందని విశ్లేషిస్తున్నారు.
ఈ ఏడాది ప్రారంభంలో 53వేలకు చేరుకున్న బంగారం.. ఆ తర్వాత భారీగా తగ్గింది. మళ్లీ కోలుకుని ఇప్పుడు 49వేలకు చేరుకుంది. 2022లో ఇది 55వేల రూపాయలకు చేరువ అవుతుందని అంటున్నారు. డాలర్పై రూపాయి మారకం విలువ బలహీనంగా ఉండటంతో అంతర్జాతీయ ధరలతో పోలిస్తే దేశీయు బులియన్ మార్కెట్లో మూడు శాతానికి పైగా ధర పలుకుతోంది. 2021లో మదుపర్లు ఈక్విటీల్లో పెట్టుబడుల మదుపుకు పరుగులు తీయడం వల్లే కాసింత బంగారం ధర తగ్గిందని అంటున్నారు. ఒమిక్రాన్ ప్రభావంతో స్టాక్ మార్కెట్ కుప్పకూలే ప్రమాదం ఉందని, అప్పుడు బంగారం ధర మరింత పెరుగుతుందని అంటున్నారు.