దీపావళి సెలవుల విషయంలో తలెత్తిన వివాదం నలుగురు జవాన్ల ప్రాణ తీసింది. తెలంగాణ-ఛత్తీస్ గఢ్ సరిహద్దులోని పారామిలిటరీ బలగాల శిబిరంలో ఈ ఘటన జరిగింది. ఛత్తీస్ గఢ్లోని సుకుమా జిల్లా పరిధిలో గల లింగంపల్లి బేస్ క్యాంప్లో ఈరోజు తెల్లవారు ఝామున జవాన్ల మధ్య కాల్పులు జరిగాయి. దీపావళి పండక్కి తనకు సెలవలు ఇవ్వలేదన్న కారణంతో కానిస్టేబుల్ రితేష్ రంజన్ ఏకే-47తో తోటి జవాన్లపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఏడుగురు జవాన్లు తీవ్రంగా గాయపడగా.. వారిని వెంటనే హెలికాప్టర్ లో తెలంగాణలోని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే నలుగురు జవాన్లు మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.