ఆచార్య సినిమా చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. ఈ సినిమాలో ఇటీవల ఓ పాట విడుదలైంది. సానా కష్టం అంటూ సాగా ఆ పాటలో లిరిక్స్ పై డాక్టర్లు మండిపడుతున్నారు. ఆర్ఎంపీ డాక్టర్ల అసోసియేషన్ ఆ పాట సాహిత్యాన్ని మార్చాలంటూ డిమాండ్ చేస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. కొత్త ఏడాది సందర్భంగా ఇందులోని ఐటమ్ సాంగ్ ‘‘సానా కష్టం వచ్చిందే మందాకినీ’’ లిరికల్ పాటను విడుదల చేసింది చిత్ర బృందం. హీరోయిన్ రెజీనా చిరంజీవి పక్కన తొలిసారిగా ఈ ఐటంసాంగ్ చేసింది.
‘సానా కష్టం’ పాట తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ జనగామ ఆర్ఎంపీ సంఘం ఆరోపించింది. ఈ పాటలోని ‘‘ఏడేడో నిమరొచ్చని కుర్రాళ్లే ఆర్ఎంపీలు అవుతున్నారే’’ అనే వాక్యాలు తమ వృత్తిని కించపర్చేలా ఉన్నాయన్నారు. దీనిపై ఆర్ఎంపీల సంఘం రాష్ట్ర కార్యనిర్వాహణ అధ్యక్షుడు పసునూరి సత్యనారాయణ.. జనగామ పట్టణ పోలీస్ స్టేషన్లో సీఐ బాలాజీ వరప్రసాద్కు ఫిర్యాదు చేశారు. పాట రచయిత భాస్కరభట్ల, దర్శకుడు కొరటాల శివపై చర్యలు తీసుకోవాలని కోరారు. వెంటనే ఆ పాటను తొలగించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.