పీఆర్సీ ప్రకటనపై సీఎం జగన్ మనసులో మాట బయట పెట్టారు. పీఆర్సీ ప్రకటిస్తాం కానీ, అది ఉద్యోగులు కోరుకున్నంత ఉండకపోవచ్చని క్లారిటీ ఇచ్చారు. ప్రాక్టికల్ గా ఆలోచించాలని సూచించారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమైన ఆయన పీఆర్సీ పుకార్లకు తెరదించారు. ఉద్యోగ సంఘాలు చెప్పిన అన్ని అంశాలను నోట్ చేసుకున్నట్లు చెప్పిన సీఎం, ప్రభుత్వం మోయలేని విధంగా భారం ఉండకూడదని.. ఉద్యోగ సంఘాలు సానుకూల దృక్పథంతో ఉండాలని కోరుతున్నట్లు తెలిపారు. ఎంత మంచి చేయగలిగితే అంత చేస్తానని.. మంచి చేయాలనే తపనతోనే ఉన్నామని వివరించారు. రెండు మూడు రోజుల్లో పీఆర్సీపై ప్రకటన చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు.
అంత తక్కవ ఇస్తే ఎలా..?
ఉద్యోగులు 55 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇటీవల సీఎస్ కమిటీ 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీన్ని ఉద్యోగ సంఘాలు తిరస్కరించాయి. తమకు 55 శాతం ఫిట్మెంట్ ఇస్తేనే ఆమోదయోగ్యంగా ఉంటుందని పునరుద్ఘాటించాయి. కరోనా పరిస్థితులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా 14.29 శాతానికి అంగీకరించాలని ప్రభుత్వ వర్గాలు చెప్పినప్పటికీ ఉద్యోగులు వెనక్కితగ్గలేదు. ఈ నేపథ్యంలో సీఎం జగన్తో ఉద్యోగ సంఘాలు సీఎం జగన్తో చర్చలు జరిపాయి.