వాయుగుండం నెలూరు వైపే కదిలి వస్తోందా ? భారీ వర్షాల గండం..సాయంత్రానికి తీరం దాటే అవకాశం .బంగాళాఖాతంలో ఆగ్నేయ దిశగా ఏర్పడ్డ అల్పపీడనం బుధవారం రాత్రి తీవ్ర వాయుగుండంగా మారింది. మద్రాస్ , పాండిచ్చేరికి ఆగ్నేయంగా 430 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ వాయుగుండం గురువారం సాయంత్రానికి తమిళనాడులోని కరైకాల్, ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట మధ్య తీరం దాటనుంది. దీని ప్రభావంతో గురు, శుక్రవారాల్లో ఏపీలోని , నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి.
రాయలసీమతో పాటు దక్షిణ కోస్తాలో ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, ప్రకాశం, గుంటూరు జిల్లాలపై ఎక్కువ ప్రభావం ఉంటుంది. సముద్రంలో 45 నుంచి 55 కిలోమీటర్లు.. గరిష్ఠంగా గంటకు 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు.