ఒకవైపు కరోనా నివారణకు వ్యాక్సిన్ వేసే చర్యలు ముమ్మరం చేస్తుంటే, మరోవైపు కరోనా వైరస్ కూడా ప్రబలిపోతోంది. దేశంలో మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్, కర్నాటక, ఉత్తర ప్రదేశ్, కేరళల్లో ఎక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ 5 రాష్ట్రాల్లో కలిపి మొత్తం నమోదైన కేసుల్లో 70.82 శాతం ఉన్నాయి. ఒక్క మహారాష్ట్రలోనే 48.57 శాతం కేసులు నమోదయ్యాయి. వైరస్ దేశవ్యాప్తంగా ప్రబలిపోతుండటంతో మళ్లీ మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వాలు నడుం బిగిస్తున్నాయి. అవసరమైన మందులు, బెడ్లు, ఏర్పాట్లలో అధికార యంత్రాంగం మునిగిపోయి ఉంది. మరోవైపు కరోనా నివారణకు ఉపయోగించే రెమిడిసివిర్ ఇంజక్షన్ల ఎగుమతిపై నిషేదం విధించారు. దేశంలో రెమిడిసివిర్ తయారు చేసే మందుల కంపెనీలన్నీ, తమ స్టాకిస్ట్ లు డిస్ట్రిబ్యూటర్ల వివరాలు తమ వద్ద ఉన్న స్టాక్ ను తెలియజేస్తూ వెబ్ సైట్ లో సమాచారం పెట్టాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.