కొంతమంది జీవితం పూలదారి అయితే.. మరికొందరి జీవితం ముళ్ళదారి.. అటువంటి ముళ్ళదారిలో నడిచి జీవితాన్ని తీర్చిదిద్దుకున్న గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ రంజిత్. రంజిత్ ఈ రోజు ఐఐఎం లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్నాడంటే దాని వెనుక కన్నీటి గాథ. ఐఐఎంలో చదవాలని దేశంలో ప్రతిభావంతులైన విద్యార్థుల కోరిక. ఐఐఎంలో సీటు దొరకడమే అదృష్టం. అటువంటి ఐఐఎంలో రంజిత్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరాడు. రాత్రుళ్ళు సెక్యూరిటీ గార్డుగా వుద్యోగం చేస్తూ.. పగలు కాలేజీకి వెళ్ళేవాడు.
ఇంటిపైకప్పు ఉరుస్తుంటే.. దానికి ప్లాస్టిక్ పట్టా వేసుకుని బ్రతికేంత పేదరికం. కుటుంబాన్ని పోషించుకునేందుకు ఒకపూట తిని.. మరోపూట పస్తులుండే దయనీయమైన పరిస్థితి. తల్లి రోజువారీ కూలీగా ఉండేది. ఇటువంటి దయనీయమైన పరిస్థితుల్లో డిగ్రీ చదివి.. పీజీ పట్టా చేతబట్టుకుని.. మద్రాస్ ఐఐటీలో ఎకనామిక్స్ లో పీహెచ్డీ కూడా పూర్తి చేశాడు. ఇప్పుడు ఐఐఎం రాంచీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు. ఈ సందర్భంగా తన గతాన్ని, తన ఇంటి ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి.. లక్ష్యాన్ని సాధించాలనుకునే పేద విద్యార్థులకు ఆదర్శంగా నిలిచాడు. ఇతరులు కూడా తనలాగానే, ముళ్లబాటను.. పూలబాటగా మార్చుకోవాలని.. కష్టాలను అధిగమించి, చదువుకోవాలని సందేశాన్ని ఇచ్చాడు.