రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు విశాఖ ఉక్కు కర్మాగారంపై దివాళాకోరు రాజకీయాలు చేస్తున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరణ, ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గే ప్రశ్నే లేదని ఆర్ధికశాఖ సహాయ మంత్రి రాజ్యసభలో స్పష్టంగా చెప్పారు. కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కూడా దక్షిణ కొరియాకు ప్లాంట్ ను అమ్మకానికి పెట్టినట్లు 2019 అక్టోబర్ లో అవగాహన ఒప్పందం కుదిరినట్లు చెప్పారు. ఇవన్నీ నగ్న సత్యాలు.
అయితే ముఖ్యమంత్రి జగన్ గానీ, ప్రతిపక్షనేత చంద్రబాబు గానీ, రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలుగానీ, వారితో అంటకాగిన జనసేన గానీ, ఒక్కమాటలో చెప్పాలంటే వారంతా మోసపూరిత రాజకీయాలు, పరస్పర దుమ్మెత్తిపోసుకునే విమర్శలు చేసుకుంటున్నారు. స్థానికంగా, రాజకీయంగా లాభపడాలని దొంగ నాటకాలు ఆడుతున్నారే తప్ప, ఈ విషయంలో ఎవరికీ చిత్తశుద్ది లేదు. పోరాడే దమ్ము ధైర్మం లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రధానికి ఒక లేఖ రాసి ఆ తర్వాత యధాప్రకారం తమ ఎంపీలతో పార్లమెంట్ లో మాట్లాడిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వేలెత్తి చూపే దమ్ము మాత్రం చేయలేకున్నారు. ప్రతిపక్షనేత చంద్రబాబు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కేంద్రప్రభుత్వం చర్య అని చెప్పడానికి కూడా భయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకుంటే జగన్ ఏం చేస్తున్నారనే ప్రశ్నిస్తున్నాడు గానీ, కేంద్రాన్ని మాత్రం నిలదీయలేకపోతున్నారు. ఒక్కమాట కూడా మోడీకి వ్యతిరేకంగా మాట్లాడలేకపోతున్నారు. ఈ విషయంలో జగన్ ది, చంద్రబాబుది ఒకటే దారి. జగన్ ని చంద్రబాబు దుమ్మెత్తిపోయడం, తద్వారా రాజకీయ లబ్ది కోసం ట్రై చేయడం.
పవన్ కళ్యాణ్ కూడా అదే దారి. రెండు పార్టీల మధ్య సర్దుబాట్లు, తిరుపతి ఎంపీ ఉప ఎన్నిక సీటుపై చర్చల కోసం ఢిల్లీకి వెళ్ళి, పనిలో పనిగా స్టీల్ ప్లాంట్ విషయంలోనూ ఒక ప్రకటన చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై సీఎం జగన్ మౌనంగా వుంటే లాభం లేదంటూ ఒక సలహా ఇచ్చేశారు. ఇక రాష్ట్రానికి చెందిన సుజనా చౌదరి వంటి బీజేపీ నేతలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఎవరూ ఆపలేరని, ఇంతకుమించి ప్రత్యామ్నాయం లేదని తేల్చేశారు. ఒక్క వామపక్ష పార్టీలు తప్ప మిగతా పార్టీలన్నీ విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో స్థానిక రాజకీయ స్వప్రయోజనాల కోసం తప్పుడు ప్రకటనలు చేస్తున్నారే తప్ప, చిత్తశుద్ది లేని మాటలు మాట్లాడుతున్నారు. మోడీని గానీ, మోడీ ప్రభుత్వాన్ని గానీ ఒక్క మాట అనే దైర్యం అటు జగన్ కి లేదు, చంద్రబాబుకి లేదు. పవన్ కళ్యాణ్ సంగతి సరే సరి. ఇదీ విశాఖ ఉక్కులో మన నేతల తుక్కు రాజకీయం. జగన్ , బాబు , పవన్ అందరూ మోడీ రాగం ఆలపిస్తుంటే పోరాడేదెవరు ..? కమ్యూనిస్టులది పాపం కంఠశోషే ..