ఏపీలో కరోనా విలయం తగ్గకముందే.. బ్లాక్ ఫంగస్ ప్రజల్ని భయపెడుతోంది. ఇప్పటి వరకూ ఉత్తరాదిలోనే ఇలాంటి కేసులు బయటపడగా.. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ఏపీలో పలు జిల్లాల్లో ఇప్పటికే చాలామంది బాధితులు ఆస్పత్రులకు వస్తున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో బ్లాక్ ఫంగస్ కేసులు కలవరపెడుతున్నాయి. పట్టణంలో ఆరుగురికి బ్లాక్ ఫంగస్ లక్షణాలున్నట్టు మార్కాపురం కొవిడ్ కేంద్రం ఇన్ ఛార్జి డాక్టర్ రాంబాబు వెల్లడించారు. వారిలో ముగ్గురు నంద్యాలలో చికిత్సపొందుతుండగా.. మరో ముగ్గురు ఇళ్లలోనే ఉటూ వైద్య సేవలు పొందుతున్నారని వివరించారు. ఓ బాధితుడుకి కంటి శస్త్ర చికిత్స చేయాల్సిన అవసరం ఉందని, దానికి రూ.10లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. అటు చీరాలలో ఓ వ్యక్తి బ్లాక్ ఫంగస్ తో మృతి చెందినట్టు వార్తలొచ్చాయి. అటు రాష్ట్ర ప్రభుత్వం కరోనాతోపాటు, బ్లాక్ ఫంగస్ చికిత్సను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలో చేరుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
దేశంలో పరిస్థితి ఇలా..
దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యారు. ఇప్పుడిప్పుడే వాటి సంఖ్య పెరుగుతోంది. బ్లాక్ ఫంగస్ తో మృతి చెందిన తొలి కేసు ఉత్తరాఖండ్ లో నమోదైంది. రిషికేష్ లోని ఎయిమ్స్ ఆస్పత్రిలో ఓ పేషంట్ బ్లాక్ ఫంగస్ తో చనిపోయాడు. ఇదే ఆస్పత్రిలో కోవిడ్ రోగులుగా ఉన్న వారిలో 19 మందికి బ్లాక్ ఫంగస్ సోకింది. డెహ్రాడూన్ నుంచి వచ్చిన 36 ఏళ్ళ వ్యక్తికి ఆపరేషన్ చేయాల్సివుందని, అయితే బ్లాక్ ఫంగస్ వ్యాధి సోకడంతో ఆపరేషన్ కి వీలుకాక, అతను చనిపోయాడని ఎయిడ్స్ డైరెక్టర్ రవికాంత్ తెలిపారు. 19 మంది బ్లాక్ ఫంగస్ రోగుల్లో 11 మంది ఉత్తరాఖండ్ చెందిన వారుకాగా, 8 మంది ఉత్తరప్రదేశ్ కి చెందిన వారని తెలిపారు.
కళ్లు, ముక్కుపై తీవ్ర ప్రభావం..
బ్లాక్ ఫంగస్ సోకిన వారిలో 13 మంది రోగులు గతంలో ఏదో ఒక ఆపరేషన్ చేయించుకున్న వారేనని తెలిపారు వైద్యులు. బ్లాక్ ఫంగస్ సోకిన మరో ఇద్దరు పేషంట్లకు కళ్ళు తీసేయాల్సి వచ్చిందని చెప్పారు. 11 మందికి ముక్కులోని దూలం తొలగించాల్సి వచ్చిందన్నారు. వాళ్ళందరికీ ముక్కులో ఫంగస్, వ్యర్ధ కణజాలం ఉండిపోయిందన్నారు. బ్లాక్ ఫంగస్ కేసులను సునిశితంగా పరిశీలిస్తున్నామని రవికాంత్ వెల్లడించారు.