కాటికాపరులు ఇప్పుడు క్రమక్రమంగా కనుమరుగైపోయిన రోజులివి. శవం తగలబెట్టే సమయంలో వారికి తృణమో, పణమో ముట్టజెబుతుంటారు బంధువులు. కానీ దాదాపుగా కాటికాపరులు ఇప్పుడు లేరనే చెప్పుకోవాలి. అయితే తెలంగాణలోని జగిత్యాల మండలం లక్ష్మీపూర్ లో ఓ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన మిట్టపెల్లి బాపురెడ్డి ఆదివారం చనిపోయాడు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని అంత్యక్రియల కోసం శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. అయితే అక్కడ శవాన్ని కాల్చేందుకు కాటి కాపరులు అడ్డుకున్నారు. ఏకంగా చితిపై కూర్చుని హంగామా చేశారు. చితిపై కూర్చున్నవారు దిగేది లేదని చెప్పారు, అంతిమ సంస్కారాలను అడ్డుకున్నారు. రూ.10 వేలు ఇస్తేనే చితి మీది నుంచి దిగుతామని భీష్మిం చారు. గ్రామస్తులు మాట్లాడి రూ.వెయ్యి వరకు ఇస్తామని చెప్పినా ఒప్పుకోలేదు. దీంతో గ్రామస్తులందకూ కలిసి చితిపై ఉన్న కాటి కాపరులను పక్కకు లాగేసి తోసి అంతిమ సంస్కారాలు చేయాల్సి వచ్చింది. కుటుంబ పెద్దను కోల్పోయిన బాధలో ఆ ఇంటివారు ఉంటే.. కాటికాపరులు ఇలా 10వేలు డిమాండ్ చేయడం దారుణం అని అంటున్నారు స్థానికులు.