మా’ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి వైస్ ప్రెసిడెంట్ గా గెలుపొందిన బెనర్జీ మా ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నిర్వహించిన మీడియా సమావేశంలో తన రాజీనామాను ప్రకటించే ముందు తనకు ఎదురైన చేదు అనుభవాలను చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. పోలింగ్ రోజున తనీశ్ ను మోహన్ బాబు గారు తిట్టడం చూసి, అక్కడే ఉన్న తాను… మంచు విష్ణు వద్దకు వెళ్ళి… గొడవలు వద్దు అని చెప్పానని అన్నారు. దాంతో మోహన్ బాబు కోపంతో తనపై రంకెలేశారని.. అరగంటసేపు నన్ను అమ్మనా బూతులు తిట్టారని వాపోయారు. ఒకదశలో కొట్టబోయారని కూడా చెప్పారు. ఆయన అలా తిడుతూ ఉంటే విష్ణు, మనోజ్ వచ్చి సారీ అంకుల్… ఆయనను మళ్లీ ఏమీ అనవద్దు అని రిక్వెస్ట్ చేశారని అన్నారు. డీఆర్సీ సభ్యుడు అయివుండీ మోహన్ బాబు కూడా ఇలా ప్రవర్తించారని, ఇతర డీఆర్సీ సభ్యులు కూడా దీన్ని అడ్డుకోలేదని బావురుమన్నారు. ఒకప్పుడు మోహన్ బాబు మా ఇంటి మనిషిగా, నేను మోహన్ బాబు ఇంటి మనిషిగా ఉన్నామని, మంచు లక్ష్మి, మంచు విష్ణును చిన్నప్పుడు ఎత్తుకుని తిరిగానని చెప్పారు. 40 ఏళ్ళ సినీ జీవితంలో తనకు ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదని, మూడురోజులుగా ఎంతో వేదన పడుతున్నానని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మాలో కొనసాగలేనని, అందుకే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటిస్తూ కన్నీరు కార్చారు.