మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానల్ తరఫున పోటీ చేసి గెలిచిన 11 మంది సభ్యులంతా ప్రకాష్ రాజ్ తో సహా మూకుమ్మడిగా మా సభ్యత్వానికి రాజీనామా చేశారు. మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. తమ రాజీనామాలను మా అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణుకు పంపామని తెలిపారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ తెలుగువారు కానివాళ్లు పోటీ చేసేందుకు అనర్హులు అనే నిబంధన తీసుకురాకపోతే తన రాజీనామా వెనక్కి తీసుకునేందుకు తాను సిద్ధమని అన్నారు. ఇకపై మంచు విష్ణు అధ్యక్షతన నడిచే ‘మా’లో కొనసాగరని, మంచు విష్ణు తన వాళ్లతో స్వేచ్ఛగా ‘మా’ కార్యకలాపాలు కొనసాగించవచ్చని ప్రకాశ్ రాజ్ తెలిపారు. మంచు విష్ణు పెద్ద హామీలు ఇచ్చారని, వాటి అమలులో అడ్డు రాకూడదని తమ ప్యానెల్ నిర్ణయించుకుందని పేర్కొన్నారు. అయితే తమను గెలిపించిన ఓటర్లకు విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందని, రేపు మంచు విష్ణు పనిచేయకపోతే వారి తరఫున ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. ఇది అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం కాదని, ఎంతో హుందాగా తీసుకున్న నిర్ణయం అని వివరించారు. అనంతరం శ్రీకాంత్, ఉత్తేజ్, బెనర్జీ, సమీర్ తదితరులు మాట్లాడుతూ పోలింగ్, కౌంటింగ్ సమయాల్లో రౌడీయిజం జరిగిందని, తమ ప్యానెల్ సభ్యుల పట్ల అసభ్యంగా మాట్లాడారని ఆరోపించారు. అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయని, ఈ కారణంగానే తాము రాజీనామా చేయాలనే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
అయితే మా అభివృద్ది చెందాలంటే నరేష్ ను దూరం పెట్టాలని సూచించారు. ఆయన అక్కడ ఉన్నంతకాలం మా అభివృద్ది చెందుతుందనే ఆశ తమకు లేదన్నారు. కుట్రలు, కుతంత్రాలు చేసే అలాంటి వ్యక్తిని దూరం పెట్టాలని ముక్తకంఠంతో చెప్పారు. ఇదే విషయాన్ని చిరంజీవి పెళ్ళిసందడి సినిమా ప్రీఈవెంట్ రిలీజ్ ఫంక్షన్లో చెప్పారు. అయితే నేరుగా నరేష్ పేరు చెప్పకుండా పరోక్షంగా విమర్శించారు. వ్యాధి మూలకారకానికి మందు వేయాలని, అప్పుడు రోగం నయం అవుతుందన్నారు. అంటే మా లో ఉన్న ఆ వ్యక్తి నరేష్ అని ఇప్పుడు మా ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సభ్యులంతా బాహాటంగా చెప్పారు.