ఇదో చిత్రమైన కేసు. కనీవినీ ఎరగని విచిత్రమైన కేసు. ఈ కేసు గురించి వింటే… నోరెళ్ళబెట్టేస్తారు. ఈ కేసు భార్యాభర్తల భరణం కేసు. భరణం ఇవ్వలేదని కోర్టుకి వెళితే.. లోక్ అదాలత్కు న్యాయస్థానం సిఫార్సు చేసింది. అసలు వారి వయసెంతో తెలిస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే. ఇంతకీ ఆ గొడవేంటో చూడండి.బసప్ప, కళవ్వ ఇద్దరూ భార్యాభర్తలు. మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. వయసులో ఉన్నప్పుడు విడిపోయి ఎవరి దారి వారు చూసుకున్నారు. ఇప్పటికీ 52 ఏళ్ళ అయింది. విడిపోయిన నాటి నుంచి భర్త బసప్ప.. ఆమెకు భరణం చెల్లిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆయన వయసు 85 ఏళ్ళు. కళవ్వ వయస్సు 80 ఏళ్ళు, ఇద్దరూ నడవలేని స్థితిలో ఉన్నారు.
52 ఏళ్ళుగా భరణం చెల్లిస్తూ వచ్చిన బసప్ప.. ఇప్పుడు కళవ్వకు భరణం చెల్లించలేకపోయాడు. దీంతో కళవ్వ మాజీ భర్తపై కేసు వేసింది. తనకు భరణం చెల్లించలేదంటూ కోర్టు మెట్లెక్కింది. కేసును పరిశీలించి న్యాయస్థానం.. ఈ కేసును లోక్ అదాలత్లో పరిష్కరించుకోవాలంటూ సూచించింది.దీంతో కళవ్వ లోక్ అదాలత్కు వచ్చింది. నడవలేని స్థితిలో ఉన్న ఆమెను బంధువులు ఎత్తుకుని తీసుకొచ్చారు. బసప్ప కూడా వచ్చాడు. వీరిద్దరినీ చూసిన లోక్ అదాలత్ జడ్జిలు విస్తుపోయారు. అందులోనూ భరణం కేసు అనేసరికి అవాక్కయ్యారు. ఇద్దరితో మాట్లాడి.. చివరికి రాజీ కుదిర్చారు. ఈ వయసులో భరణం గురించి కేసులు, గొడవలు వద్దని, కలిసి ఉండండి అంటూ సమాధానపరిచారు. మొత్తానికి ఇద్దరూ అందుకు అంగీకరించి చేయిచేయి కలుపుకుని ఇంటి దారి పట్టారు. ఇలా తిరిగి 52 ఏళ్ళ తర్వాత ఒక్కటయ్యింది ఈ ముదసలి జంట.