అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు.. బ్యాంకులో ఉన్న జనం డబ్బుల్ని ఆన్ లైన్ ప్రియురాలికి దోచి పెట్టేశాడు. లక్ష.. రెండు లక్షలో కాదు.. 5 కోట్ల 76 లక్షల రూపాయలు ఆన్ లైన్ గర్ల్ ఫ్రెండ్కి ధారపోసిన బ్యాంక్ మేనేజర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగుళూరులోని హనుమంతనగర్లో ఇండియన్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ హరిశంకర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్యాంక్ జోనల్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 5 కోట్ల 76 లక్షల రూపాయలు ఈ బ్యాంకులో మోసం జరిగినట్లు గుర్తించారు. మేనేజరును విచారించిన పోలీసులు.. బ్యాంక్ ఆడిటింగ్ అధికారులకు నమ్మలేని నిజాలు బయటపడ్డాయి.
ఆన్ లైన్ డేటింగ్ యాప్లో పరిచయమైన ఓ యువతి కోసం ఈ మేనేజర్.. 28 అకౌంట్ల ద్వారా 5 కోట్ల 76 లక్షల రూపాయలు ట్రాన్సఫర్ చేసినట్లు తేలింది. బ్యాంకులో ఓ మహిళా కస్టమర్ కోటి 30 లక్షల రూపాయలు ఫిక్సడ్ డిపాజిట్ చేసింది. ఆ ఫిక్సడ్ డిపాజిట్ను సెక్యూరిటీ పెట్టుకుని 70 లక్షల రూపాయలు రుణంగా తీసుకుంది. ఈ డాక్యుమెంట్ల ఆధారంగా వివిధ రకాల అకౌంట్లను ఓపెన్ చేసి ఓవర్ డ్రాఫ్ట్ కింద చూపించి 5 కోట్ల 76 లక్షల రూపాయలు తన ఆన్ లైన్ ప్రియురాలి ఖాతాకు మళ్ళించాడని తేలింది.
వీటిని పశ్చిమబెంగాల్, కర్నాటక బ్యాంక్ అకౌంట్లకు ట్రాన్సఫర్ చేశాడు. బ్యాంక్ మేనేజర్ హరిశంకర్ పర్సనల్ అకౌంట్ నుంచి 12 లక్షల 50 వేల నగదు కూడా ట్రాన్సఫర్ చేసినట్లు తేలింది. డేటింగ్ యాప్లో పరిచమైన యువతికే ఆ నగదు మొత్తం ఇచ్చానని మేనేజర్ తెలిపాడు. ఆ యువతి మాయలో పడి ఈ నగదు బదిలీ చేశానని చెప్పారు. ఇది కాకుండా మరో కారణం ఏదైనా ఉందా అనేది తేలాల్సి ఉంది. ఆన్ లైన్ మోసాలు, సైబర్ నేరాలు జరుగుతాయని తెలిసి కూడా బ్యాంక్ మేనేజర్ ఇలా చేయడంపై క్షుణ్ణంగా ఆరా తీస్తున్నారు పోలీసులు.