తండ్రి ఎవరో తెలియని కొడుకు… తన తల్లిని అడగడం.. తండ్రి ఎవరో తెలుసుకునేందుకు, తల్లికి జరిగిన అన్యాయాన్ని నిలదీయడం.. ఆ తర్వాత డీఎన్ఏ టెస్టుతో తండ్రి ఎవరో తెలుసుకోవడం.. చివరగా ఆ తండ్రిని జైలుకి పంపడం.. ఇదేదో సినిమా కధ కాదు. నిజంగా జరిగిందే. 27 ఏళ్ళ తర్వాత ఓ కొడుకు తల్లికి చేసిన న్యాయం. ఒక కామాంధుడికి పుట్టిన తాను ఆ కామాంధ తండ్రిని జైలుకి పంపిన సంఘటన ఉత్తరప్రదేశ్ లోని షాజాన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
ఓ యువతిపై 14 ఏళ్ళ వయసులో, 27 ఏళ్ళ క్రితం ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారు. ఈ అత్యాచారం కారణంగా ఆమె చిన్న వయసులోనే గర్భం దాల్చింది. ఇప్పుడు ఆమెకు 40 ఏళ్ళు. 14 ఏళ్ళ వయసులో కొడుకుని కని, ఆ కొడుకును అనాధ సంరక్షణ ఆలయానికి అప్పగించింది. ఆ తర్వాత 5 ఏళ్ళకు తనపై జరిగిన అత్యాచారాన్ని చెప్పకుండా ఓ వ్యక్తిని పెళ్ళి చేసుకుంది. పదేళ్ళ తర్వాత భర్తకు ఆమెపై జరిగిన సామూహిక అత్యాచారం తెలిసి, ఆమెకు ఒక బిడ్డ పుట్టాడని తెలిసి విడాకులు ఇచ్చేశాడు. అనాధ శరణాలయంలో పెరుగుతున్న బిడ్డ.. తన చరిత్ర తెలుసుకుని గతేడాది తల్లిని వెదుక్కుంటూ వచ్చాడు.
తన తండ్రి ఎవరో చెప్పమని నిలదీశాడు. అప్పుడు 14 ఏళ్ళ వయసులో తనపై జరిగిన అత్యాచారం గురించి తల్లి కొడుకికి చెప్పింది. ఈ అత్యాచారం కారణంగానే కన్నానని కూడా తెలిపింది. నక్వి హసన్, అతడి తమ్ముడు గుడ్డు తనపై అప్పట్లో అత్యాచారం చేసి గర్భవతిని చేశారని చెప్పింది. వారిద్దరిలో నువ్వు ఎవరికి పుట్టావో తనకు తెలియదని చెప్పడంతో తల్లిని తీసుకెళ్ళి 27 ఏళ్ళ క్రితం జరిగిన అత్యాచారంపై కేసు పెట్టించాడు. ఆ తర్వాత కోర్టులో పిటీషన్ వేసి తన తల్లిపై ఇద్దరు చేసిన అత్యాచారం చేసిన వ్యక్తి ఎవరో తేల్చాలని, డీఎన్ఏ పరీక్ష జరిపించాలని కోరారు. కోర్టు నక్వి హసన్, అతని సోదరుడు గుడ్డులకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించడంతో, వైద్యులు డీఎన్ఏ పరీక్షలు జరిపారు. నక్వి హసన్ డీఎన్ఏతో కొడుకు డీఎన్ఏ సరిపోయింది. దీంతో నక్వి, గుడ్డులపై అత్యాచారం కేసు నమోదు చేశారు.