మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 11న కొత్త మంత్రివర్గం కొలువుదీరనుంది. అదే రోజు కొత్తమంత్రులు ప్రమాణస్వీకారం చేసే అవకాశముంది. ఢిల్లీ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజ్ భవన్ లో గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ తో భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటన విశేషాలు, వివరాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళారు. ప్రధానంగా మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపైనే గవర్నర్ తో చర్చించారు.
కాగా రేపు అంటే 7వ తేదీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఇప్పుడున్న మంత్రివర్గానికిదే చివరి కేబినేట్ మీటింగ్. ఈ మీటింగ్ అనంతరం దాదాపు అన్ని శాఖల మంత్రులు రాజీనామాలు చేయనున్నారు. ఆ రాజీనామాల లేఖలతో పాటు రెండు మూడు రోజుల్లో కొత్త మంత్రుల పేర్ల జాబితాను గవర్నర్ వద్దకు తీసుకెళ్ళనున్నారు జగన్.
11వ తేదీన కొత్త మంత్రివర్గం ప్రకటన, ప్రమాణస్వీకారం జరగనున్నాయి. ఇదే అంశంపై గవర్నర్ తో చర్చించిన ఆయన… మంత్రివర్గంతో ప్రమాణస్వీకారం చేయించాలని విజ్ఞప్తి చేశారు. ఇక ఇప్పుడు గవర్నర్ భేటీ ముగియడంతో మంత్రివర్గ విస్తరణ ప్రక్రియ వేగవంతం కానుంది.