సాధారణంగా ఏదైనా చోరీ చేసేటప్పుడు దొంగ పట్టుబడితే వాడి మీద కేసు పెడతారు. అయితే బెంగుళూరులోని రిచ్ మండ్ రోడ్లో ఓ దొంగ జనం చేతిలో చావు దెబ్బలు తిని, తనపై దౌర్జన్యం జరిగిందంటూ వారిపైనే కేసు పెట్టాడు. రితేష్ జయకుమార్ అనే యువకుడు క్యాబ్ డ్రైవర్ కు కత్తి చూపించి పర్సు, ఫోన్ ఇవ్వాల్సిందిగా బెదిరించాడు. డ్రైవర్ జయకుమార్ ను కారులో నుంచి బయటకి తోసేసి పెద్దగా కేకలు వేశాడు. దీంతో చుట్టుపక్కల వారు వచ్చి జయకుమార్ ను పట్టుకునేందుకు ప్రయత్నం చేశాడు. వారిపైకి కూడా దాడి చేసేందుకు ప్రయత్నించడంతో, స్థానికులు దేహశుద్ది చేశారు.
దాంతో అక్కడి నుంచి పారిపోయిన జయకుమార్ నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్ళి తనను కొంతమంది స్థానికులు తీవ్రంగా కొట్టారంటూ కేసు పెట్టారు. అయితే విచారణ చేపట్టిన పోలీసులు నోరెళ్ళబెట్టారు. ఆ తర్వాత జయకుమార్ ను అరెస్టు చేసి కేసు పెట్టారు. తనను కొట్టిన వారిపై కూడా కేసు పెట్టాలని దొంగ జయకుమార్ పోలీసులను డిమాండ్ చేశాడు. దీంతో పోలీసులు గుర్తు తెలియని వ్యక్తుల దాడి అంటూ దొంగ ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదు చేశారు. ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదనే నిబంధనతోనే కేసు పెట్టాం తప్ప, దొంగను పట్టుకునేందుకు స్థానికులు ముందుకు రావాలంటూ పోలీసులు ఓ ఉచిత సలహా పడేశారు.