మంచు విష్ణుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తా… అతనిని నిలదీస్తా… ప్రశ్నిస్తూనే ఉంటా… మా సంక్షేమం కోసం, మా సభ్యుల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటా… అంటూ ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు. ఓ ఇంటర్వూలో ఆయన మా అసోసియేషన్ ఎన్నికలు, ఫలితాలు, గెలుపోటములపై మాట్లాడారు. మాలో ఎన్నో సమస్యలున్నాయని, గతంలో ఎన్నికైన అధ్యక్షలు, సభ్యులు… ఆ సమస్యలను పరిష్కరించలేకపోయారు. అందుకే బాధ్యత తీసుకోవాలని ఈసారి ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ చేశానని చెప్పారు.
అధ్యక్షుడిగా ఎన్నికైతే తన ప్యానల్ సభ్యులతో కలిసి ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని అనుకున్నానని చెప్పారు. అయితే ఓడిపోయానని, గెలిచి ఉంటే తాను అనుకున్న లక్ష్యాలను సాధించేవాడినని, శాశ్వత పరిష్కారం చూపించేవాడినని అన్నారు. తాను ఓడినా, మా అసోసియేషన్ కోసం, సభ్యుల సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నిస్తూనే ఉంటానని, పోరాటం చేస్తూనే ఉంటానని అన్నారు. పోలింగ్ జరిగిన రోజు, కౌంటింగ్ సమయంలో వివాదాలు చెలరేగాయని… బీజేపీ వాళ్ళు మంచు విష్ణు విజయం కోసం పని చేశారని ఆయన ఆరోపించారు. మోహన్ బాబు విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆయన ఎవరి జోలికి వెళ్ళరని, అయితే ఆయన జోలికి వస్తే మాత్రం సహించరని… మంచి మనిషి అని కితాబిచ్చారు.