సంక్రాంతికి స్పెషల్ బస్సులపై 50శాతం చార్జీలు పెంచుతామని ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రం అసలు చార్జీలు పెంచకుండామే మామూలు రేట్లకే టికెట్ల అమ్మకాలు మొదలు పెట్టింది. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరం నుంచి తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలకు 4,318 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు టీఎస్ఆర్టీసీ తాజాగా ప్రకటించింది. ఈనెల 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు బస్సులను నడుపుతున్నట్లు తెలిపింది. పండుగ సందర్భంగా నడిపించే ప్రత్యేక బస్సులకు ఎటువంటి అదనపు ఛార్జీలను వసూలు చేయడం లేదని టీఎస్ ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్ మేనేజర్ వరప్రసాద్ స్పష్టం చేశారు. ప్రత్యేక బస్సుల పర్యవేక్షణకు సుమారు 200 మంది అధికారులు, ఉద్యోగులను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అడ్వాన్స్ రిజర్వేషన్ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. www.tsrtconline.in వెబ్ సైట్ లో రిజర్వేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించినట్లు వెల్లడించారు.