ప్రముఖ హస్యనటుడు సారధి నేడు ఉదయం స్వర్గస్థులయ్యారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. సారధి1960లో సీతారామ కళ్యాణంతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ చిత్రంలో నలకూబరునిగా నటించారు. అనేక సినిమాలలో హాస్యపాత్రలు పోషించి ప్రేక్షకుల మెప్పు పొందారు. వీరు దాదాపు 372 తెలుగు సినిమాలలో నటించారు. తెలుగు చిత్రపరిశ్రమను మద్రాసు నుండి హైదరాబాదుకు తరలించడంలో క్రియాశీలకంగా వ్యవహరించారు.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) వ్యవస్థాపక సభ్యుడు. ఆంధ్రప్రదేశ్ సినీకార్మికుల సంస్థకు వ్యవస్థాపక కోశాధికారిగా ఉన్నారు. సారధి నాటకరంగానికి విశేష సేవచేశారు. ఋష్యేంద్రమణి, స్థానం నరసింహారావు, రేలంగి వెంకట్రామయ్య, బి.పద్మనాభం వంటి గొప్ప నటులతో కలిసి నాటకాలలో నటించారు.నందమూరి తారకరామారావు దర్శకత్వంలో వెలువడిన సీతారామ కళ్యాణం సినిమాలో నలకూబరునిగా తొలిసారి చలనచిత్రంలో నటించారు.