కేరళలో కుంభవర్షాలు కురుస్తున్నాయి. నదులు ఉప్పొంగుతున్నాయి. వర్షాల ధాటికి ఇప్పటికే పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. ముఖ్యంగా కొట్టాయం జిల్లాలో వర్షం భీభత్సం సృష్టిస్తోంది. ఒక్క కొట్టాయం జిల్లాలోనే పది మందికిపైగా చనిపోయారు. అత్యంత విషాదం ఏమిటంటే, ఒకే కుటుంబానికి చెందిర ఆరుగురు మృత్యువాతపడడం. కుట్టికల్ లోని కావలి ప్రాంతంలో ఓ చర్చి సమీపంలో వీరు నివాసం ఉంటున్నారు. అయితే భారీవర్షాల కారణంగా వచ్చిన వరదల్లో వీరు ఉంటున్న ఇల్లు కొట్టుకుపోయింది. ఆ సమయంలోనే వీరంతా ఇంట్లోనే ఉన్నారు. వట్టంగల్ మార్టిన్, అతని భార్య, తల్లి, ముగ్గురు ఆడపిల్లలు వరదల్లో జలసమాధి అయ్యారు. వీరిలో ముగ్గురి శవాలను దొరకగా, మిగిలినవారు గల్లంతయ్యారు.
ఇక వర్షాల కారణంగా కేరళ రాష్ట్రం అతలాకుతలమైపోయింది. వర్షాలకు పిట్టల్లా జనాలు రాలిపోతున్నారు. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ ఘటనపై సీఎం పినరయి విజయన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వర్షాలపై ఆయన ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. సహాయక చర్యల్లో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లను రంగంలోకి దించారు.