మనిషి జీవితంలో సెల్ ఫోన్ ముఖ్యభాగమైపోయింది. సెల్ ఫోన్ లేని జీవితాన్ని ఊహించుకోలేని పరిస్థితి ఏర్పడింది. సెల్ ఫోన్ లేని కాలంలో మనుషుల మధ్య పలకరింపులు ఉండేవి. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత పలకరింపులు పక్కన పెడితే… దానితోనే కాలం గడుపుతున్న ఘటనలు ఏన్నో చూస్తున్నాం. ఒక్క సెల్ ఫోన్ కారణంగా కాపురాలు కూడా కూలుతున్నాయంటే దీని ప్రభావం ఎంతలా ఉందో ఊహించుకోవచ్చు. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే… సెల్ ఫోన్ కోసం విడాకులు కోరింది ఓ మహాఇల్లాలు. గొడవ పెరగడంతో భర్త మీదకి కత్తి కూడా దూసింది. వివరాల్లోకి వెళితే…
ముంబైలోని బాంద్రా ప్రాంతంలో బాబూరావ్ అనే వ్యక్తి సెల్ ఫోన్ పాడైపోయింది. దీంతో భార్య సెల్ ఫోన్ తీసుకున్నాడు. రెండు రోజులు గడిచినా ఫోన్ తిరిగి ఇవ్వకపోవడంతో భర్తను నిలదీసింది. తన ఫోన్ తనకు ఇచ్చేయాలని లేదంటే విడాకులు ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీంతో నిర్ఘాంతపోయిన భర్త… భార్యతో గొడవ పడ్డాడు. కోపోద్రిక్తురాలైన భార్య వంటగదిలోకి వెళ్ళి కూరగాయలు తరిగే కత్తితో భర్త మీదకు విసిరేసింది. దీంతో కత్తి అతడి పెదాలకు తగలడంతో తెగాయి. దీంతో వెంటనే అతను ఆస్పత్రికి వెళ్ళి చికిత్స చేయించుకున్నాడు. అతని పెదాలకు కుట్లు కూడా వేయాల్సి వచ్చింది. భార్య చేసిన నిర్వాకంపై పోలీసు కేసు నమోదైంది. ఆమెను స్టేషన్ కి తరలించారు పోలీసులు. ఇలాంటి ఘటనే గతంలో బెంగుళూరులోనూ చోటుచేసుకుంది. చంద్రప్రకాష్ అనే భర్త, తన భార్య సునీత్ ఫోన్ తీసుకుని వాట్సప్ చెక్ చేశాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆమె, కత్తితో భర్త చేతి వేళ్ళను నరికేసింది.