లోక కళ్యాణం కోసం అకుంఠిత దీక్ష చేపట్టాడు. శివుడికి ఈ జీవితం అంకితం అంటూ ఎత్తిన చేయి దించకుండా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 48 ఏళ్ళు అలాగే ఉండిపోయాడు. సంసార సాగరం నుండి బయటపడి.. సన్యాసిగా మారిపోయాడు. ఆయన పేరు అమర్ భారతీ. నాగ సాధువు.
1973లో అమర్ భారతి గృహస్తాశ్రమం నుండి సన్యాసం స్వీకరించాడు. అప్పటికే ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. సహకార సంఘంలో పని చేశాడు. 1973లో సన్యాసం స్వీకరించిన ఆయన మహాకుంభమేళాలో ప్రపంచశాంతిని కాంక్షిస్తూ తన కుడి చేతిని పైకి ఎత్తాడు. మళ్ళీ ఇప్పటివరకు ఆయన తన కుడి చేతిని కిందకి దించలేదు. 48 ఏళ్ళు గడిచిపోయాయి. ఎత్తిన ఆ చేయిని దించకపోవడంతో నెక్రోసిస్ అనే వ్యాధి బారిన కూడా పడ్డారు. అయినా చేతిని మాత్రం దించలేదు.
ఇది ఆయన అకుంఠిత దీక్షకు నిదర్శనం. తొలి రెండేళ్ళు చేతి నొప్పితో విపరీతమైన బాధను అనుభవించాడు. 48 ఏళ్ళుగా ఆయన చేతి వేలి గోళ్ళు పెరిగిపోయాయి. చేతి నరాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు చేయి దించాలనుకున్నా.. నరాలు సహకరించే పరిస్థితి లేదు. నాగసాధువైన అమర్ భారతీ ఇక్కడి వారికి తెలియకపోయినా… ఉత్తరాదిలో బాగా పరిచయమున్న పేరు. ఆయనను చూసేందుకు తండోపతండాలుగా తరలివస్తుంటారు. ఆయనపై జాతీయ చానెళ్ళు ఎన్నో ప్రత్యేక కధనాలు కూడా ప్రసారం చేశాయి.