ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది. ‘ఇండియా టుడే’ ”మూడ్ ఆఫ్ ది నేషన్” పేరిట నిర్వహించిన సర్వేలో దేశంలో బీజేపీ, ఏపీలో వైసీపీ, తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తాయి. పార్లమెంట్ స్థానాల ప్రాతిపదికగా జరిగిన ఈ సర్వేలో కేంద్రంలో బీజేపీ కూటమికి సీట్లు తగ్గుతాయి. అయితే ప్రధాని పదవికి 53 శాతం మంది నరేంద్రమోడీ సరైన అభ్యర్ధి అని అభిప్రాయపడగా, రాహుల్ గాంధీకి 9, కేజ్రీవాల్ కు 7 శాతం మంది మాత్రమే మద్దతిస్తున్నారు.
ప్రజాదరణలో మోడీకి దరిదాపుల్లో కూడా ఏ ప్రతిపక్షపార్టీ నాయకుడు కూడా లేడు. గత రెండేళ్ళలో అనేకమైన సమస్యలు, కష్టనష్టాలు కేంద్రం నుంచి ఎదురైనా.. ప్రజలు మాత్రం మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. అయితే సీట్లు మాత్రం తగ్గుతాయి. బీజేపీకి 286 సీట్లు మాత్రమే వస్తాయి. గతంలో కంటే 60కి పైగా సీట్లు తగ్గుతాయి. కాంగ్రెస్ కూటమికి 146 సీట్లు వస్తాయి. ఇతరులకు 111 స్థానాలు వస్తాయి. ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ విఫలమైందని కూడా సర్వేలో అభిప్రాయం వ్యక్తమైంది.
మన రాష్ట్రాల ప్రస్తావనలో ఏపీలోని 25 లోక్ సభ స్థానాల్లో వైసీపీకి 18, టీడీపీకి 7 స్థానాలు వస్తాయని అంచనా వేశారు. ఈ లెక్కన వైసీపీకి 5 తగ్గుతాయి. టీడీపీకి 3 పెరుగుతాయి. జనసేన, బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని, ఈ రెండు పార్టీలకు గత చరిత్రే పునరావృతమవుతుందని సర్వేలో స్పష్టమైంది. తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాలో తమ పార్టీ పరిస్థితి బాగుంటుందని జనసేన ఇప్పటివరకు చెప్తున్న మాటలకి, సర్వేలో చెప్పిన దానితో సరితూగదు.
అత్యధిక ఓటర్లు ఇప్పటికీ వైసీపీకి అనుకూలంగానే ఉన్నారని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు అన్నది టీడీపీని గెలిపించే స్థాయిలో లేదన్నది కూడా స్పష్టమైంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఇప్పుడిప్పుడే హిందుత్వ కార్డుతో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తోన్న బీజేపీకి తెలంగాణలో 6 లోక్ సభ స్థానాలు వస్తాయని, టీఆర్ఎస్ కు 8, కాంగ్రెస్-ఎంఐఎంకు 3 సీట్లు వస్తాయని అంచనా వేశారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి టీఆర్ఎస్ కొంచెం మొగ్గుంటుందని, ఈ రెండు రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో జగన్ కే ఎక్కువ బలం ఉందని ‘ఇండియా టుడే’ నిర్వహించిన సర్వే తేల్చింది.