రోగుల పట్ల, రోగులకు అందించే వైద్యం పట్ల డాక్టర్లు అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే ఆ రోగి ఆరోగ్యంపై పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అలాంటి ఘటనే ఇది కూడా. ఆస్పత్రి నిర్లక్ష్యం కారణంగా ఓ అమ్మాయి తన చేయిని కోల్పోయింది. ఈ దారుణ ఘటన పాట్నలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే… బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో రేఖ అనే 20 ఏళ్ళ యువతికి పెళ్ళి నిశ్చయమైంది. పెళ్ళి తేదీ కూడా ఖరారైంది. అయితే ఈ యువతికి చెవి పోటు రావడంతో జులై 11న మహావీర్ ఆరోగ్య సంస్థాన్ ఆస్పత్రికి చికిత్స కోసం వెళ్ళింది. పరీక్షించిన వైద్యులు, ఆమె చేతికి ఇంజెక్షన్ వేశారు. ఇంజెక్షన్ వేసిన కాసేపటికి అమ్మాయి చేయి, ఆకుపచ్చ రంగులోకి మారిపోయింది. దీంతో కంగారు పడ్డ యువతి కుటుంబసభ్యులు ఆమెను మళ్ళీ అదే ఆస్పత్రికి తీసుకెళ్ళారు. దీనివల్ల పెద్ద ప్రమాదమేమీ లేదంటూ మరో ఇంజెక్షన్ వేశారు. అయినా ఎలాంటి మార్పు లేకపోవడంతో పాటు చేయి కదలలేని స్థితిలోకి వచ్చేసింది. దీంతో ఆ యువతి మరో ఆస్పత్రికి వెళ్ళింది.
అక్కడ ఆమెను పరీక్షించిన డాక్టర్లు ఖంగు తిన్నారు. అమ్మాయి చేయి మొత్తం ఇన్ఫెక్షన్ వ్యాపించిందని గుర్తించారు. చేయి మోచేతి వరకు తీసి వేయాలని, లేదంటే భుజం వరకు ఇన్ఫెక్షన్ వ్యాపించి, ప్రాణం మీదకు వస్తుందని హెచ్చరించారు. చివరికి సర్జరీ చేసి ఆమె మోచేతి వరకు తీసివేశారు. ఈ విషయం తెలుసుకున్న పెళ్ళికొడుకు తరఫు వారు పెళ్ళి సంబంధం రద్దు చేసుకున్నారు. చేయిని కోల్పోయిన రేఖ.. తనకు తొలిసారిగా ఇంజెక్షన్ చేసి.. తనను ఈ స్థితికి తీసుకొచ్చిన మహావీర్ ఆరోగ్య సంస్థాన్ ఆస్పత్రిపై ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, మెడికల్ ఆఫీసర్లు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..