ముహూర్తం బాగా లేదని, పెళ్లయిన తర్వాత పదేళ్లుగా భర్త దగ్గరకు రాని భార్యకు.. భర్త కోరికపై హైకోర్టు విడాకులు మంజూరు చేసింది. చట్టాలు మహిళలకే అనుకూలం అనుకుని, ఇలాంటి వేధింపులకు పాల్పడితే సహించేది లేదని కోర్టు హెచ్చరించింది. పెళ్లయిన తర్వాత 11 రోజులు మాత్రమే కాపురం చేసి, ఆ తర్వాత పుట్టింటికి వచ్చేసి, మళ్లీ కాపురానికి రాని భార్య, భార్య అనే పదానికే కళంకం అని అభిశంసించింది. చత్తీస్ ఘడ్ లోని రాయ్ పూర్ లో సంతోష్ సింగ్ అనే వ్యక్తి 10 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. భార్య 11 రోజులే కాపురం చేసింది. ఆ తర్వాత తన ఇంటిలో పండగ ఉందంటూ తల్లిగారింటికి వెళ్లిపోయింది. మళ్లీ తిరిగి రాలేదు. ఇలా పదేళ్లపాటు మంచి మహూర్తం లేదని ఒకసారి, రాకూడదని మరొకసారి, ఇలా వాయిదాలు వేస్తూ వచ్చింది.
భర్త, జిల్లా ఫ్యామిలీ కోర్టులో కేసు వేస్తే, మంచి మహూర్తం లేకపోవడంతో తాను కాపురానికి పోలేదని పిటిషన్ వేసింది భార్య. భర్త విడాకుల పిటిషన్ ని జిల్లా ఫ్యామిలీ కోర్టు తిరస్కరించింది. దీంతో సంతోష్ సింగ్ హైకోర్టుని ఆశ్రయించాడు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ గౌతమ్, రజిని, ఈ కేసు విచారణలో తీవ్రమైన వ్యాఖ్యలు చేసారు. 10ఏళ్లు నీకు మహూర్తాలే దొరకలేదా, మంచి ఘడియలే రాలేదా అంటూ వ్యాఖ్యలు చేసి భర్తకు విడాకులిప్పించారు. పెళ్లయిన తర్వాత 11రోజులే కాపురం ఉండి ఆ తర్వాత పదేళ్లు దూరంగా ఉన్న భార్యకు, భార్య అని చెప్పుకునే హక్కు లేదని, పెళ్లి ఒప్పందాన్ని ఆమె తిరస్కరించిందని చెప్పింది. ఈ కేసులో భార్యకు ఎటువంటి భరణం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది.