ఉద్యోగాలు ఇస్తామంటూ వేలు, లక్షలు వసూలు చేసే మోసగాళ్ళ ముఠాలకు మనదేశంలో కొదవ లేదు. అయితే ఇప్పుడు ఏకంగా రాజ్యసభ సీటు, గవర్నర్ సీటు ఇస్తామంటూ మోసం చేసే ముఠాలు తెరపైకి వచ్చాయి. దీని బేరాలు లక్షల్లో కాదు.. వందల కోట్లలో ఉంటున్నాయి. ఆశావహులకు వల వేసే ఈ ముఠాను సీబీఐ పట్టుకుంది. నలుగురు సభ్యులు గల ఈ ముఠా కేంద్రంలో తమకు పలుకుబడి ఉందని, గవర్నర్, రాజ్యసభ సీట్లు ఇప్పిస్తే వందల కోట్లు ఇవ్వాలంటూ గాలం వేస్తున్నారు.
వీరందరినీ అరెస్ట్ చేసిన సీబీఐ.. కేసులు నమోదు చేసింది. మహారాష్ట్రలోని లాతూర్ కి చెందిన కమలాకర్ ప్రేమ్ కుమార్, కర్నాటక బెల్గాంకు చెందిన రవీంద్ర విట్టల్, ఢిల్లీకి చెందిన మహేంద్ర ఆరోరా, అభిషేక్ గోరా, అజాజ్ ఖాన్లను అరెస్ట్ చేశారు. ఇదికాకుండా సీబీఐలో ఉన్నతస్థాయిలో తమకు సంబంధాలు ఉన్నాయని చెబుతూ కోటీశ్వరుల నుంచి డబ్బులు గుంజేందుకు ప్రయత్నాలు చేశారు. రాజ్యసభ, గవర్నర్, కేంద్ర స్థాయిలో పదవులు, కార్పోరేషన్ పదవులు ఇప్పిస్తామంటూ ఈ ముఠా ఎర వేస్తుంది. వీళ్ళ ప్రలోభాలకు లొంగి కొంతమంది పెద్దమొత్తంలో డబ్బులు కూడా ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది.