అన్నిటినీ గూగుల్ మీదే ఆధారపడితే ఒక్కసారి కొంపలు మునిగి ప్రాణం మీదకు తెచ్చుకుంటారు. ఇటీవల కాలంలో ప్రతీ దానికి పరిష్కారాలు గూగుల్ లోనే వెతుకుతున్నారు. ఇది చాలావరకూ మంచిదే అయినా.. ఒక్కోదఫా వికటిస్తుంది. ఉన్నతెలివిని కొంచెం కూడా ఉపయోగించకుండా గూగుల్ మ్యాప్స్ వాడేవారు.. చాలా సందర్భాల్లో దారితప్పి కన్ను లొట్టపోయిన సంగతులు చాలానే ఉన్నాయి. అలాంటిదే ఈ సంఘటన.
కేరళలో డాక్టర్ సోనియా అనే మహిళ తనతల్లి సోసమ్మ, బంధువు అనీష్, తన మూడేళ్ళ బిడ్డతో కలిసి కారులో ప్రయాణిస్తోంది. నిన్నటి రోజున 10 :30కి ఎర్నాకులం నుంచి కుమ్భనాడ్ వెళ్లి తిరిగి వస్తున్నారు. దారికోసం గూగుల్ మ్యాప్ ఆన్ చేసింది. ప్రయాణం చేస్తున్న వారి కారు.. తిరువత్తు కళ్ నత్తకం సిమెంట్ జంక్షన్ వద్ద దారితప్పింది. అక్కడ పొలాల్లో మోకాలి లోతు నీళ్లలో దిగిపోయింది. ఆ సమయంలో కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. కారులోని వారి కేకలు విని చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకొని..లోపల ఉన్న వారిని బయటకు తీశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే కారు పూర్తిగా నీళ్లలో మునిగిపోయింది.
గత ఏడాది కూడా 34 ఏళ్ల సతీష్ అనే వ్యక్తి తెల్లవారుజామున గూగుల్ మ్యాప్స్ దారితప్పి.. కారుతో సహా కాలువలో మునిగి ప్రాణాలు పోగొట్టుకున్నారు. నాగపూర్ లో కూడా మరొక వ్యక్తి ఇలాగే రూట్ తప్పి.. కాలువలో పడ్డాడు. ఇలా గూగుల్ మ్యాప్స్ చాలా వరకూ ఉపయోగకరమైనప్పటికీ.. ఒక్కోసారి తెలివి వాడకపోతే ఇలాంటి అనర్ధాలు జరిగే అవకాశం ఉంది. సో మీరు కూడా ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండండి. గూగుల్ మ్యాప్స్ వాడినప్పటికీ కాస్త సొంత తెలివిని కూడా ఉపయోగించండి.