అదృష్టం ఎవరికి ఎప్పుడు ఎలా తలుపు తడుతుందో ఊహించడం కష్టం. ఒక్కోసారి దురదృష్టం వెంటాడుతుంటే.. అదృష్టం ఆకాశానికెత్తేస్తుంది. 50 లక్షల రూపాయలు అప్పు తీర్చుకునేందుకు ఇల్లు అమ్మకానికి పెట్టి.. అడ్వాన్స్ తీసుకునే 24 గంటల ముందు ఓ వ్యక్తికి అదృష్టం కలిసొచ్చింది. ఆ దురదృష్టవంతుడిని అదృష్టవంతుడిగా మార్చాసింది. ఏకంగా కోటి రూపాయల జాక్ పాట్ తగిలింది. కేరళకు చెందిన 50 ఏళ్ళ మహ్మద్ అనే వ్యక్తి మంజేశ్వరంలో పెయింటర్ గా పనిచేస్తున్నాడు. కుటుంబపోషణ, బిడ్డల చదువులు, పెళ్ళిళ్ళ కోసం అప్పులు చేశాడు. దీంతో వారం క్రితం తన ఇంటిని అమ్మకానికి పెట్టాడు. అప్పటికే అతను అద్దె ఇంట్లోకి మకాం మార్చాడు.
మంగళవారం నాడు అడ్వాన్స్ తీసుకోవాల్సి ఉంది. అయితే సోమవారం రోజు తాను కొన్న లాటరీ టిక్కెట్టుకు బంపర్ ఆఫర్ తగిలింది. కోటి రూపాయల జాక్ పాట్ ప్రైజ్ వచ్చింది. కుటుంబ అవసరాల కోసం బ్యాంకులు, బంధువుల నుంచి రుణాలు తీసుకున్నాడు. ఇల్లు అమ్మి బాకీలు తీర్చేయాలని అనుకున్నాడు. సరిగ్గా 24 గంటల ముందు అదృష్టం తలుపు తట్టి, కోటి రూపాయల లాటరీ తగలడంతో ఎగిరి గంతేశాడు. లాటరీలో పన్నులన్నీ పోనూ.. మహ్మద్కు 63 లక్షల రూపాయలు వస్తుంది. అప్పులన్నీ తీర్చగా.. ఇంకా 13 లక్షలు మిగులుతుంది. ఈ డబ్బుతో అప్పులన్నీ తీర్చేసి, మనశ్శాంతిగా ఉంటానని మహ్మద్ చెప్పుకొచ్చాడు. దురదృష్టవంతుడిని ఎవరూ బాగు చేయలేరు. అదృష్టవంతుడిని ఎవరూ చెరపలేరు అన్న సామెత.. మహ్మద్కు సరిగ్గా సరిపోతుందనడానికి ఇదో ఉదాహరణ.