తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని, అత్తని నాగుపాముతో కాటు వేయించి చంపేసిన కోడలికి బెయిలిచ్చేందుకు సుప్రీంకోర్టు కూడా నిరాకరించింది. ఇటీవల కాలంలో రాజస్థాన్ లో పాముని ఉపయోగించి సొంత బంధువుల్నే చంపడం ఎక్కువైపోయిందని, కేరళలో కూడా ఇలాంటివే జరిగాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అందువల్ల కొత్తరకం హత్యాకాండకు స్వస్తి పలకాలని స్పష్టం చేసింది. రాజస్తాన్ లోని జున్ జున్ జిల్లాలో అల్పన అనే కోడలు అత్త సుభోద్ దేవితో కలసి ఉంటోంది. ఆమెకు జైపూర్ కి చెందిన మనీష్ అనే యువకుడితో అక్రమ సంబంధం ఉంది. భర్త మిలట్రీలో పనిచేస్తూ ఉండటంతో అప్పుడప్పుడు ఇంటికొచ్చిపోయేవాడు. దీంతో అల్పన, మనీష్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త సచిన్ కు ఈ విషయం తెలియదు.
అత్తకు కోడలి అక్రమ సంబంధం గురించి తెలియడంతో ఆమె మందలించింది. దీంతో కోడలు ప్రియుడు మనీష్ తో కలసి కేసులకు దొరక్కుండా అత్తను ఎలా చంపాలో ఇద్దరూ కలసి పథకం వేసుకున్నారు. దీంతో పాముని తెప్పించి రాత్రి ఆమె పడుకుని ఉండగా పాముతో కాటువేయించారు. పాము కాటుగా భావించి బంధువులు ఆమె అంత్యక్రియలు కూడా పూర్తిచేశారు. అయితే మిలట్రీలోనే ఉన్న మరిదికి అనుమానం వచ్చి ఆమె ఫోన్ కాల్ రికార్డ్ తీశాడు. దీంతో అత్త చనిపోయిన రోజే 124 ఫోన్ కాల్స్, మనీష్ – అల్పన మధ్య ఉన్నాయి. మెసేజ్ లు కూడా ఉన్నాయి. దీంతో పోలీసులు వారిని గట్టిగా ప్రశ్నించడంతో చేసిన నేరం బయటపడింది. అప్పట్నుంచి జైలులోనే ఉన్నవారికి బెయిలు ఇవ్వాల్సిందిగా పెట్టుకున్న పిటిషన్ ను అన్ని కోర్టులు తిరస్కరించడంతో చివరకు సుప్రీంకోర్టుకు పోయారు. సుప్రీంకోర్టు కూడా బెయిల్ నిరాకరించింది.