తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో హీరో మోహన్ బాబు భేటీ కావడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో ఈ భేటీ జరిగింది. పలు అంశాలపై వీరిద్దరి మద్య సుదీర్ఘంగా చర్చ జరిగింది. ప్రధానంగా తాజా ఏపీ రాజకీయ పరిణామాలపై చర్చ జరిగినట్లు సమాచారం. నందమూరి తారక రామారావుతో అత్యంత సన్నిహితంగా ఉండే మోహన్ బాబు… ఎన్టీఆర్ ప్రోత్సాహంతో తెలుగుదేశం పార్టీలో చేరి రాజ్యసభ సభ్యుడుగా కొనసాగారు.
ఎన్టీఆర్ తదనంతరం చంద్రబాబు హయాంలో పార్టీకి దూరంగా ఉంటూ సినిమాలతో బిజీగా గడిపారు. చంద్రబాబుతో మాట్లాడకుండా మిన్నకుండిపోయారు.వైఎస్.రాజశేఖర్ రెడ్డి హయాంలో మంచు ఫ్యామిలీ వైఎస్ కుటుంబానికి దగ్గరయ్యింది. మోహన్ బాబు కొడుకు విష్ణు.. వైఎస్ సోదరుడి కుమార్తె విరానికాను ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో ఇరు కుటుంబాల మధ్య బంధుత్వం ఏర్పడింది. తన విద్యాసంస్థ శ్రీ విద్యానికేతన్ బకాయిల విషయమై టీడీపీ హయాంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా మోహన్ బాబు ధర్నా సైతం చేపట్టారు.
దీంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే కారణంతో ఆయనపై కేసు నమోదైంది. 2019 ఎన్నికలకు ముందు మోహన్ బాబు వైసీపీలో చేరారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆయన సైలెంట్ అయ్యారు. ఈ క్రమంలో వైసీపీతోనూ దూరం పెంచుకున్న మోహన్ బాబు వైసీపీకి రాజీనామా చేస్తున్నానని, ఇకపై రాజకీయాల జోలికి వెళ్లనంటూ ప్రకటించి సంచలనం రేపారు. తాజాగా చంద్రబాబుతో మోహన్ బాబు భేటీ కావడం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.