AK -47 రైఫిల్స్ తో తీరానికి కొట్టుకొచ్చిన బోటు.. పోలీస్ అలర్ట్.మహారాష్ట్రలోని ఓ బీచ్ లో ఏకే 47 ఆయుధాలు కలకలం రేపాయి. మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో పర్యాటక ప్రాంతమైన హరిహరేశ్వర్ బీచ్ వద్ద ఏకే47 ఆయుధాలు కలిగిన పడవ కనిపించింది. సముద్ర తీరంలో ఈ బోటు కనిపించినట్లు మత్సకారులు తెలిపారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, ఘటనా స్థలికి చేరుకొని విచారణ చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా హైఅలెర్ట్ జారీ చేశారు.
ముంబయికి 190 కిలోమీటర్ల దూరంలో ఉన్న శిరివర్ధన ప్రాంతంలో మత్సకారులకు ఈ బోటు కనిపించింది. అయితే బోటులో ఎవరూ లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అలెర్ట్ అయిన రాయగఢ్ ఎస్పీ అశోక్ దుధే, ఇతర సీనియర్ అధికారులు ఘటనాస్థలికి చేరుకొని.. బోటును అధీనంలోకి తీసుకొన్నారు. బోటులో తనిఖీలు చేయగా.. మూడు ఏకే 47 రైఫిళ్లు, కొన్ని బుల్లెట్లు లభించాయి. దీంతో మరింతగా అప్రమత్తమైన పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. పడవ లభించిన చుట్టుపక్కల ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.