మనం బైక్ పై వెళ్తుంటే పోలీసులు మధ్యలో ఆపి ఫైన్లు వేయడం చూస్తూనే ఉంటాం.. త్రిబుల్ రైడింగ్, రాంగ్ రూట్, ఓవర్ స్పీడ్, హెల్మెట్ లేకపోవడం, ఇలా ఎన్నో కారణాలతో పోలీసులు చలనాలతో మనల్ని బాధేస్తుంటారు. అయితే చాలావరకూ ఎవరూ ఎదురు చెప్పలేని పరిస్థితి.. ఎందుకంటే వాహనదారులు కూడా రోడ్డుపై నిబంధనలు సరిగా పాటించరు. అందుకే పోలీసులు ఫైన్లు వేసినప్పుడు తప్పించుకోవడానికి కాస్త మామూళ్లు ఇచ్చేసి.. వచ్చేస్తూ ఉంటారు.
తాజాగా కేరళలోని పుక్కట్టు ఏరియాలో ఓ రైడర్ కు పోలీసులు 250 రూపాయలు చలానా విధించారు. ఆ రైడర్ చలానా కాపీని సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్ గా మారింది. అయినా చలనా వేస్తే తప్పేంటని అనుకోకండి. ఆ చలానాలో బైక్ లో పెట్రోల్ లేనికారణంగా ఫైన్ వేసినట్టుగా ప్రింట్ అయి ఉంది. దీంతో ఇప్పుడు ఆ పోస్ట్ వైరల్ గా మారిపోయింది. ఎక్కడ చూసినా ఈ విషయంపైనే చర్చ జరుగుతోంది. పెట్రోల్ లేకపోయినా నేరమేనా అంటూ పోలీసుల తీరుపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే ఆ రైడర్ మాత్రం తాను రాంగ్ రూట్లో వచ్చానని చెబుతున్నాడు. కానీ చలానాలో మాత్రం ఇలా పెట్రోల్ లేని కారణంగా ఫైన్ వేసినట్టుగా ఉందని చెబుతున్నారు.
అయితే ఇంతకీ అసలు విషయం ఏమిటంటే పెట్రోల్ లేకపోతే బ్రిటన్ లో ఫైన్ వేస్తారు. ఎందుకంటే ట్రాఫిక్ లో ఉండగా పెట్రోల్ లేక వాహనం ఆగిపోతే.. ట్రాఫిక్ లో మిగిలిన వారు కూడా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అందుకే బ్రిటన్ లో పెట్రోల్ లేకపోయినా 2500 రూపాయల వరకూ ఫైన్లు వేస్తుంటారు. అయితే కేరళ ట్రాఫిక్ పోలీసులు కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో తయారైన మెషిన్లు వాడుతున్నారు. అందుకే రైడర్ చలానా విషయంలో పొరపాటున “రాంగ్ రూట్” అనే ఆప్షన్ బదులుగా, “నో ఫ్యూయల్” అనే ఆప్షన్ పై చలానా ప్రింట్ అయిపోయింది. అందుకే ఈ తప్పు జరిగినట్టు తెలిసింది. అయితే ప్రస్తుతానికి మన దేశంలో మాత్రం ఆలాంటి చట్టం ఏదీ లేదని తెలుస్తోంది.