ప్రజల్లో మంచి పేరు తెచ్చుకొనేందుకు పెద్ద మొత్తంలో ఔషధాలు, వైద్య పరికరాలు సేకరించి పంపిణీ చేస్తామనడం రాజకీయ నాయకులకు సమర్థనీయం కాదని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. వీరి చర్యల వల్ల వ్యాధిగ్రస్తులు బ్లాక్ మార్కెట్ లో అధిక ధరలకు ఔషధాలు కొనుగోలు కొనుగోలు చేయాల్సి వస్తుందని, ఇటువంటి పరిస్థితుల్లో కొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్నారని తెలిపింది. దీనికి బాధ్యులను గుర్తించాలని, వారంలో నివేదిక సమర్పించాలని పోలీసులను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఔషధాలు నిల్వ చేయడం రాజకీయ నాయకుల పని కాదని స్పష్టం చేసింది. ప్రతి ఒక్కరూ హేతుబద్ధంగా నడుచుకోవాలని ధర్మాసనం పేర్కొంది. రాజకీయ నాయకులు ప్రాణాధార ఔషధాలను నిల్వచేయడాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో ఢిల్లీ డ్రగ్ కంట్రోలర్ను కూడా ప్రతివాదిగా చేర్చుతూ నోటీసు జారీ చేసింది.