పోలీసులకు మిస్టరీగా మారిన ఓ లేడీ టీచర్ హత్య కేసులో హంతకులు ముగ్గురూ మహిళలేనని తేలింది. కర్నాటకకు చెందిన నంజగూడ్ పట్టణంలో సులోచన అనే 45 ఏళ్ళ వితంతువు తన నివాసంలో హత్యకు గురైంది. గొంతు నులిమి ఆమెను చంపినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. పోలీసులు ఈ కేసులో క్లూ దొరకక ఇంతకాలంగా తంటాలు పడ్డారు. హిందీ టీచర్ గా పనిచేసే సులోచనకు పెళ్ళయిన కొడుకు, కూతురు ఉన్నారు. ఇద్దరూ మరోచోట ఉద్యోగం చేసుకుంటున్నారు.
నాలుగేళ్ళ క్రితం సులోచన భర్త మృతి చెందారు. ఒక దేవాలయంలో పనిచేసే మరుగేష్ అనే వ్యక్తితో ఆమెకు అక్రమసంబంధం ఏర్పడింది. దీంతో మురుగేష్ భార్య గాయత్రి తన భర్తతో సంబంధం వదులుకోవాలని పలుదఫాలు సులోచనను హెచ్చరించింది. గాయత్రి ఆ టౌన్ కౌన్సిలర్ గా ఉంది.
సులోచనను హత మారిస్తే తన భర్త అక్రమసంబంధం మానుకుంటాడని భావించి, తన బంధువులతో కలిసి రాత్రివేళ సులోచనను గొంతు నులిమి చంపేసింది. ఐదు నెలల తర్వాత ఈ వ్యవహారం మొత్తం బయటకి రావడంతో గాయత్రితో పాటు మరో ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు.