సాహసమే ఊపిరిగా బతికేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అదే ఆశయసాధనగా తమ లక్ష్యాన్ని చేరుకోవడంలో మృత్యువుకు కూడా భయపడరు. అలాంటి సాహసవీరుల్లో మన రాష్ట్రానికి చెందిన పర్వతారోహకుడు మల్లి మస్తాన్ బాబు. ప్రపంచంలోని ఎత్తైన శిఖరాలన్నీ ఎక్కి.. ఆ శిఖరాల్లోనే తుది శ్వాస విడిచారు. అలాంటి సాహసికుడే కేరళకు చెందిన హజాస్. 31 ఏళ్ళ హజాస్ స్కేట్ బోర్డుపై భారతదేశ యాత్ర చేయాలనుకున్నాడు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 3,700 కి.మీ స్కేటింగ్ బోర్డుపైనే ప్రయాణానికి సంకల్పించాడు. మే 29వ తేదీన స్కేటింగ్ బోర్డుపై తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రపంచంలో స్కేటింగ్ బోర్డుపై దేశవ్యాప్త పర్యటన చేయాలనుకున్న తొలి వ్యక్తి కూడా హజాస్ కావడం విశేషం. ఇది పూర్తయిన తర్వాత నేపాల్, భూటాన్, కాంబోడియా దేశాల్లో కూడా స్కేటింగ్ బోర్డుపై తన యాత్ర సాగించాలని నిర్ణయం తీసుకున్నాడు.
మూడేళ్ళ క్రితం ఇందుకోసం తన ఉద్యోగానికి రాజీనామా చేసి, స్కేటింగ్ బోర్డుపై పిల్లలకు శిక్షణ ఇస్తూ తన ఆశయసాధనకే అంకితమయ్యాడు. సాహసం వెనకే మృత్యువు పొంచి ఉంటుంది. ఆ విధంగానే హజాస్ స్కేటింగ్ సాహసం వెనక మృత్యువు కూడా దాగింది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ కు వెళుతున్న సమయంలో హర్యానాలోని కల్కా అనే ప్రాంతంలో లారీ ఢీ కొనడంతో హజాజ్ మృతి చెందాడు. పంచకుల నుంచి హిమాచల్ ప్రదేశ్ లోని నల్ ఘర్ పోతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం స్థలంలో ఉన్న వారు హజాస్ విషయం తెలిసి, కాపాడాలని ప్రయత్నించినా.. మృత్యువు అతని ప్రాణాలను తీసుకుంది. మరో 15 రోజుల్లో కాశ్మీర్ కు చేరుకుంటాడన్న తరుణంలో ఈ దారుణం జరిగింది.
హజాస్ కంప్యూటర్ సైన్సులో గ్రాడ్యుయేటర్. ఓ సాఫ్ట్ వేర్ సంస్థలో ఉన్నతోద్యోగం చేస్తూ ప్రపంచయాత్రలో భాగంగా తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. 3001 కి.మీ ప్రయాణం చేసిన తర్వాత ఈ దారుణం జరిగింది. ఇంటి నుంచి స్కేట్ బోర్డుపై ప్రయాణానికి 2 జతల బట్టలు, హెల్మెట్, బూట్లతోనే బయలుదేరాడు. హజాస్ సాహసయాత్ర తెలిసి, అతన్ని ఆహ్వానించే వారి ఇళ్ళకు వెళ్ళి.. విశ్రాంతి తీసుకుని బయలుదేరేవాడు. తన యాత్ర గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన వివరాలు పొందుపరిచేవాడు. మరో 600 కి.మీ ప్రయాణిస్తే కాశ్మీర్ చేరుకునేవాడు. అయితే అంతలోనే విధి కాటేసింది.