విశాఖపట్నం ఆర్కే బీచ్ వద్ద అదృశ్యమైన వివాహిత సాయిప్రియ కేసు మళ్ళీ రెండో దశలో కీలక మలుపుతిరిగింది. పెళ్ళిరోజున భర్త శ్రీనివాసులుతో బీచ్ కి వచ్చిన ఆ యువతి… మొగుడికి మస్కా కొట్టి లవర్ కోసం నెల్లూరుకు వచ్చేసింది. ఇప్పుడు ఏకంగా తండ్రికి పంపిన ఆడియో మెసేజ్ లో , తాను ప్రియుణ్ణి పెళ్లి చేసుకున్నానని చెప్పింది. చాలాకాలంగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నామని తెలిపింది. చావైనా , బ్రతుకైనా ప్రియుడితోనేనని చెప్పేసింది. తనకోసం వెతకొద్దని తెలిపింది. ప్రభుత్వ అధికారులు కూడా తనను క్షమించాలని కోరింది. అయితే భర్తకు విడాకులకు ఇవ్వకుండానే ఇలా రెండో పెళ్లిచేసుకోవడం ఇప్పుడు నేరమైంది.
అమాయక భర్త ఆమె కోసం మేరేజ్ డే గిఫ్ట్ గా బంగారు గాజులు కూడా కొని , బీచ్ కి తీసుకొచ్చాడు. పధకంప్రకారమే , ఆమె ప్రియున్ని నెల్లూరు నుంచి రమ్మని పిలిచి , అతడితో చెక్కేసింది. పాపం , ఏ పాపం ఎరుగని భర్త , పోలీసుల యక్ష ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వచ్చింది. అత్తమామలు కూడా తమ అల్లుడు బంగారమని పోలీసులకు చెప్పారు. పాపం అమాయకుడైన భర్త .. తన భార్య కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బీచ్లో అలల ప్రవాహంలో కొట్టుకుపోయిందని భావించాడు. అతని ఫిర్యాదు మేరకు నేవీ సిబ్బంది, హెలికాఫ్టర్ లు రంగంలోకి దిగి సముద్రమంతా గాలించారు. అయినా ఆచూకీ లభించలేదు. తీరా చూస్తే ఆమె ప్రియుడు రవితో కలిసి నెల్లూరు పరారైంది. నెల్లూరుకి వచ్చిన తర్వాత సాయిప్రియ తన బంధువులకు సమాచారం అందించడంతో అసలు విషయం బయటకొచ్చింది.
శ్రీనివాస్ హైదరాబాద్లోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తుండడంతో ఈ జంట హైదరాబాద్లో కాపురం పెట్టింది. అయితే పెళ్లి తర్వాత కూడా సాయి పల్లవి రవితో ప్రేమ వ్యవహారాన్ని కొనసాగించింది. నాలుగు నెలల క్రితం కంప్యూటర్ కోర్సు చేయాలంటూ సాయి ప్రియ హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చింది. ఇదే సమయంలో సెకండ్ మ్యారేజ్ డే అని శ్రీనివాస్ ఈ నెల 25న హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చాడు.
అదే రోజు సాయంత్రం 5.30 కి భర్త తో కలిసి బీచ్కి వెళ్లిన సాయి ప్రియ, అంతకు ముందే ఆ సమాచారాన్ని ప్రియుడు రవికి చేరవేసింది. శ్రీనివాస్ ఏమరపాటుగా ఉన్న సమయంలో రవితో కలిసి సాయి ప్రియ అక్కడి నుంచి పారిపోయింది. ఇది తెలియని శ్రీనివాస్ తన భార్య తప్పిపోయిందని తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఏకంగా హెలికాప్టర్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పుడు అందరినీ ఎర్రిపప్పలు చేసి , భర్తకళ్ళు కప్పి , ప్రియుడితో చెక్కేసి , పెళ్లికూడా చేసేసుకుంది..