టాలీవుడ్ కమెడియన్ పృధ్వీరాజ్ జనసేన పార్టీలో చేరనున్నారు. గతంలో ఆయన వైసీపీ పార్టీలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున విస్తృత ప్రచారం కూడా చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ తనతో నడిచిన ఒక్కొక్కరినీ అందలం ఎక్కించారు. ఈ క్రమంలోనే పృధ్వీరాజ్ పార్టీ కోసం చేసిన కష్టాన్ని గుర్తించి, టీటీడీకి చెందిన ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్ పదవిని ఇచ్చారు. అయితే ఆ ఛానల్ లో పనిచేస్తోన్న ఓ మహిళతో రాసలీలలు నడిపించారనే ఆరోపణలు రావడం, ఆడియో వైరల్ కావడంతో జగన్ ఆయనను పదవి నుంచి తప్పించారు. అంతటితో ఆగకుండా వైసీపీ నుంచి కూడా సస్పెండ్ చేశారు. దీంతో తిరిగి సినిమాలతో బీజీ అయ్యారు పృధ్వీరాజ్.
ఇదిలావుంటే.. ఇప్పుడు ఆయన జనసేన పార్టీలోకి చేరనున్నట్లు ప్రకటించారు. మెగా బ్రదర్ నాగబాబును కూడా పృధ్వీరాజ్ కలిశారు. నాగబాబును కలిసిన అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. ప్రస్తుతం జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చాతుర్మాస దీక్షలో ఉన్నారు. ఆయన దీక్ష పూర్తికాగానే.. ఓ మంచిరోజు పార్టీలో చేరనున్నట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లోనూ జనసేన తరఫున బరిలోకి దిగాలనే ఆలోచనలో కూడా ఉన్నట్లు సమాచారం.