ఆంధ్ర-తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ మరో సంచలనమైన నిర్ణయం తీసుకోబోతోంది. ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా సమావేశం కాబోతున్నారు. ఈరోజు మునుగోడు నియోజకవర్గంలో కోమటిరెడ్డి రాజమోహన్ రెడ్డిని బీజేపీలో చేర్చుకునేందుకు ఆయన హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో మద్యాహ్నం భోజన కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ ను అమిత్ షా ఆహ్వానించారు. ఇది వరకు నరేంద్రమోడీ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు చిరంజీవిని ఆహ్వానించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు అమిత్ షా. తాజాగా ఇప్పుడు ఎన్టీఆర్ ను తమవైపు తిప్పుకునేందుకు వ్యూహరచన చేసినట్లు తెలుస్తోంది.
గతంలో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున విస్తృత ప్రచారం చేశారు. నందమూరి తారక రామారావు మనవడిగా ఎన్టీఆర్ కు మంచి చరిష్మా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాతలాగే జూనియర్ కూడా మంచి వాగ్ధాటి. రాజకీయ ప్రత్యర్ధులను వణికించగల నేర్పరితనం ఆయనలో ఉంది. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ చరిష్మా చూసి పార్టీలో పెద్దలే అవాక్కయ్యారు. అయితే ఎన్టీఆర్ స్పీడ్కి చంద్రబాబు బ్రేక్ వేశారు. తన కొడుకు లోకేష్ రాజకీయ ఎదుగుదలకు ఎన్టీఆర్ అడ్డంకిగా మారుతారనే ఉద్దేశ్యంతో పక్కన పెట్టేశారు. కేవలం ప్రచారానికి మాత్రమే వాడుకుని.. ఆ తర్వాత పార్టీకి, రాజకీయాలకు దూరంగా ఉంచేశారు.
ఓ దశలో నందమూరి కుటుంబానికి కూడా ఎన్టీఆర్ ను దూరం చేశారనే ప్రచారం కూడా సాగింది. అయినా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇవన్నీ సీరియస్ గా తీసుకోలేదు. తన సినీ కెరీర్ పైనే దృష్టి పెట్టి.. వన్ ఆఫ్ ద టాప్ హీరోగా ఇండస్ట్రీలో చెలామణి అవుతున్నారు. కాగా ఇప్పుడు ఎన్టీఆర్ ను భోజనానికి అమిత్ షా ఆహ్వానించడం రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. మరి బీజేపీలోకి తీసుకోవాలనే ఆలోచనతోనే ఎన్టీఆర్ ను ఆహ్వానించారని అంతా చెప్పుకుంటున్నారు. మరి షా వలకి ఎన్టీఆర్ చిక్కుతాడా లేదా అనేది చూడాలి.