సినీ నటుడు ఆర్. నారాయణ మూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా రైతులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ‘ఛలో రాజ్ భవన్’ కార్యక్రమం నిర్వహించారు. వాళ్లకు మద్దతుగా ఆ ర్యాలీలో సినీనటుడు ఆర్. నారాయణమూర్తి కూడా పాల్గొన్నారు. పోలీసులు ముందస్తు హెచ్చరికలు చేసినా.. రాజ్ భవన్కు వెళ్లడానికి ప్రయత్నించిన ఆందోళనకారుల్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆర్. నారాయణ మూర్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లోపలికి వెళ్లేందుకు వీలు లేదని పోలీసులు చెపుతున్నా వినకపోవడంతో.. ఉద్యమకారులందరిని అరెస్ట్ చేశారు. వ్యవసాయం, విద్య, వైద్యంను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని ఆర్. నారాయణమూర్తి తెలిపారు.