స్కానింగ్ సెంటర్లలో తప్పులు జరగడం సర్వ సాధారణమే. వ్యాపారరిత్యా కొంతమంది డాక్టర్లు కక్కుర్తి పడి ఉన్న జబ్బులు లేవని చెప్పడం.. లేని జబ్బులు ఉన్నవని చెబుతూ.. డబ్బులు పిండికోవడం అక్కడడక్కడా జరుగుతున్నదే. అయితే.. స్కానింగ్ సెంటర్లలో అవకతవకలు జరిగితే అంత తేలిగ్గా వదిలి పెట్టాల్సిన పరిస్థితి లేదు. నాగ్పూర్లోని ఓ స్కానింగ్ సెంటరుకు జాతీయ వినియోగదారుల ఫోరమ్ ఒక కోటి 20 లక్షల రూపాయల నష్ట పరిహారం ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. ఇంత భారీ మొత్తంలో నష్ట పరిహారం ఇవ్వాలని జాతీయ వినియోగదారుల ఫోరమ్ ఎందుకు తీర్పు చెప్పిందో తెలుసా ?
ఓ గర్భవతికి స్కానింగ్ చేసి బిడ్డకు చేతులు లేకపోయినా.. బిడ్డ బాగానే ఉన్నట్లు .. బిడ్డకు జన్యు సంబంధమైన లోపాలు ఉన్నా.. అవేవీ లేనట్టు ఆ స్కానింగ్ సెంటరులో రిపోర్టు ఇచ్చారు. దీంతో తల్లిదండ్రులు సంతోషంగానే ఉన్నారు. డాక్టర్లు కూడా ఈ స్కానింగ్ రిపోర్టును నమ్మే ఆ గర్భవతికి 9 నెలల పాటు మందులు ఇచ్చారు. చివరకు ప్రసవం జరిగేటప్పటికీ ఆ బిడ్డ అనేక లోపాలతో పుట్టాడు. ఆ లోపాలన్నింటినీ పిండస్థ దశలోనే 17 నుంచి 18 వారాల లోపు కన్నుక్కోవచ్చు. ఇది స్పష్టంగా తెలిసే అవకాశముంది.
కానీ స్కానింగ్ సెంటర్ నిర్లక్ష్యం వల్ల .. బిడ్డ స్కానింగ్ రిపోర్టు తప్పుగా ఇచ్చారు. దీంతో బాధితులు జాతీయ వినియోగదారుల ఫోరమ్ను ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన ఫోరమ్… స్కానింగ్ సెంటర్ నిర్వహిస్తున్న డాక్టర్ దిలీప్… ఒక జీవితాన్ని నాశనం చేశాడని, ఆ బిడ్డ జీవితాన్ని వందేళ్ళ పాటు నాశనం చేయడంతో పాటు.. ఆ తల్లిదండ్రులను జీవితకాలం మానసిక క్షోభకు గురి చేశాడని.. ఇంతటి దారుణ నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిన డాక్టరుకు కఠిన శిక్ష వేయాల్సిందని కూడా వినియోగదారుల ఫోరమ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం స్కానింగ్ సెంటర్ దుర్మాగం, నిర్లక్ష్యం వల్లనే ఈ దారుణం జరిగిందని పేర్కొంటూ ఒక కోటి 20 లక్షల రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశించింది.