అవన్నీ బయటపెడితే..
తలలు ఎక్కడ పెట్టుకుంటారు..
సోషల్ మీడియా తలచుకుంటే ఎవరినైనా పైకి లేపనూ కలదు.. పాతాళంలోకి తొక్కేయనూ కలదు. ఇందుకు చాలా మంది ఉదాహరణలుగా నిలిచారు. రాత్రికి రాత్రే ఫేమస్ అయిన వారిని కూడా మనం చాలామందిని చూసే ఉంటాం. అలాగే ఒకే ఒక్క వీడియో కారణంగా పాతాళానికి పడిపోయిన వారిని కూడా చూశాం. అయితే ఇప్పుడు తాజాగా సోషల్ మీడియా ధాటికి మంచు కుటుంబం విలవిలలాడుతోంది. మోహన్ బాబుతో పాటూ, ఆయన కుమారుడు విష్ణు, కుమార్తె మంచు లక్ష్మిలను కూడా ప్రస్తుతం కొందరు సోషల్ మీడియాలో టార్గెట్ చేశారు.
మోహన్ బాబు తాజాగా నటించి, విడుదలకు సిద్ధంగా ఉన్న సన్ అఫ్ ఇండియా మూవీపై సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో దాడి జరుగుతోంది. ఈ మూవీ ఆన్లైన్ టికెట్లను ఎవరూ బుక్ చేసుకోవడం లేదంటూ స్క్రీన్ షాట్లు పెట్టి.. ట్రోలింగ్ మొదలుపెట్టారు. దీనిపై తాజాగా మోహన్ బాబు స్పందించారు. ఇలాంటి ట్రోలింగ్ చూస్తే చాలా బాధగా ఉంటుందని చెప్పారు. తెలుగు ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు హీరోలు, కొందరు వ్యక్తులను నియమించుకుని మరీ ఇలాంటి ట్రోలింగ్ చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్లెవరో తనకు తెలుసనీ కూడా క్లారిటీ ఇచ్చారు.
సినిమా ఇండస్ట్రీపై కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు మోహన్ బాబు. ఇండస్ట్రీ మొత్తం ఒకే కుటుంబం అంటుంటారు.. కానీ, ఎప్పుడు చూసినా ఎవరికి గొయ్యి తవ్వాలా అని ఆలోచిస్తుంటారని చెప్పారు. ఇండస్ట్రీ అంటేనే నీచమైన కంపు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో నిజాలన్నీ బయటపెడితే తలలు ఎక్కడ పెట్టుకోవాలో కూడా వారికి అర్ధం కాదని అన్నారు. తనపై ట్రోలింగ్ పరాకాష్టకు చేరిందని ఆవేదన చెందారు. సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు ఎక్కువయ్యాయని.. రాజకీయాల్లో డిపాజిట్ రాని వాళ్ళు కూడా ఇండస్ట్రీ పెద్దలమంటూ మాట్లాడుతుంటారన్నారు. 50కోట్లు తీసుకుంటే పెద్ద గొప్పా అంటూ నర్మ గర్భంగా టాప్ హీరోలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.