మంత్రి కూతురి ప్రేమకధాచిత్రం..
ఆద్యంతం ఉత్కంఠ భరితం..
సినిమాను తలపించే లవ్ స్టోరీ… చేజింగ్లు, మ్యాపింగ్లు, టార్చర్లు, ట్విస్టులు… ఇన్ని కూడా ఒక్క సినిమాలో ఉండవేమో. అలాంటి ఫిల్మీ స్టోరీ తరహాలో ఓ ప్రేమకధాచిత్రం. బిజినెస్ టైకూన్ కూతురు నిరుద్యోగిని ప్రేమించడం… లక్షాధికారి కూతురు రిక్షావాలాను వరించడం, కోటీశ్వరుడికి కూతురు కారు డ్రైవర్ను లవ్ చేయడం.. ఇలాంటివి సాధారణంగా సినిమాల్లోనే చూస్తుంటాం. నిజ జీవితంలో మాత్రం చాలా అరుదుగా చూస్తుంటాం. అలాంటి ప్రేమకధే ఒకటి తమిళనాడులో చోటు చేసుకుంది. అది కూడా సాదాసీదా వ్యక్తి కూతురిది కాదు. ఓ మంత్రి కుమార్తెది కావడం విశేషం.
తమిళనాడు రాష్ట్ర మంత్రి శేఖర్ బాబు కూతురు డాక్టర్ జయకళ్యాణి. ఆమె కనిపించకుండా పోయేసరికి ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కూతురు కనిపించడం లేదని, ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులంతా కంటి మీద కునుకు లేకుండా గాలించారు. అయితే జయకళ్యాణి మాత్రం ప్రేమ పెళ్ళి చేసుకుని పక్క రాష్ట్రంలో పోలీసుల ముందు ప్రత్యక్షం కావడం చర్చనీయాంశమైంది. తమ ఇంట్లో పని చేసే కారు డ్రైవర్ సతీష్ ను ఆమె పెళ్ళి చేసుకోవడం విశేషం. ఆరేళ్ళుగా ప్రేమించుకుంటున్న ఈ ఇద్దరూ.. బెంగుళూరులోని హిందూ ధార్మిక సంస్థలో పెళ్ళి చేసుకున్నారు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో పెళ్ళి చేసుకున్నట్లు జయకళ్యాణీ తెలిపింది. తమకు ప్రాణహాని ఉందంటూ బెంగుళూరు సిటీ కమిషనర్ ముందు హాజరై.. రక్షణ కోరిందీ కొత్తజంట.
ఇదిలావుంటే సతీష్ విడుదల చేసిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రేమించిన విషయాన్ని మంత్రి శేఖర్ బాబుకు చెప్పానని, పెళ్ళి చేసుకుంటానని చెప్పానని, అయితే ఆయన అందుకు అంగీకరించలేదని సతీష్ చెబుతున్నాడు. తనను పోలీసుల సాయంతో రెండు నెలల పాటు అక్రమంగా నిర్బంధించి హింసించారని చెప్పాడు. ప్రస్తుతం వీరిద్దరూ పోలీసుల సంరక్షణలో ఉన్నట్లు సమాచారం.