హీరోయిన్ మీనా భర్త పోయిన దుఖంలో ఉన్నారు. ఆమె భర్త విద్యాసాగర్ అనారోగ్యంతో రెండు రోజుల క్రితం మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే విద్యాసాగర్ మృతిపై సోషల్ మీడియా, పత్రికలు కధనాలు ప్రసారం చేశాయి. మీనా ఇంటికి సమీపంలో ఎక్కువగా పావురాలు ఉన్నాయని, వాటి వ్యర్థాల నుంచి వచ్చిన గాలిని పీల్చిన కారణంగానే విద్యా సాగర్కు శ్వాస సంబంధ సమస్యలు వచ్చాయని, ఆ కారణంగానే ఆయన మరణించారంటూ వార్తలు ప్రసారం చేశాయి. అయితే మీనా తీవ్రంగా స్పందించారు. భావోద్వేగ ప్రకటన చేశారు.
“తన భర్త చనిపోయి .. నేను, నా కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది. అయితే పత్రికలు, మీడియా సంస్థలు, సోషల్ మీడియాలు పనిగట్టుకుని తన భర్త విద్యాసాగర్ మరణంపై ఇష్టానుసారం వార్తలు ప్రసారం చేశాయి. పావురాల వ్యర్ధాల వల్ల వచ్చిన గాలిని పీల్చడం వల్లే ఆయన చనిపోయారంటూ కధనాలు రాసాయి. ఇవన్నీ అసత్యాలు. తప్పుడు రాతలు. ఇలాంటి వార్తలు ప్రసారం చేసి తన కుటుంబాన్ని మరింత క్షోభకు గురి చేశారు.
ఇకనైనా ఇలాంటి అసత్య ప్రసారాలు మానేయండి. తమ పరిస్థితిని అర్థం చేసుకుని తమ ఫ్యామిలీ ప్రైవసీకి భంగం కలిగించవద్దు” అంటూ సోషల్ మీడియాలో మీనా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. అలాగే కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన వారికి మీనా ధన్యవాదాలు తెలిపారు. తన భర్త ప్రాణాలను కాపాడేందుకు తమిళనాడు సీఎం, ఆరోగ్య శాఖ మంత్రి, అధికారులు, డాక్టర్లు శాయశక్తులా కృషి చేశారని, వారికి ధన్యవాదాలు తెలిపారు.