కరోనా వ్యాక్సిన్ మాకొద్దు బాబోయ్..

    0
    539

    ఏపీలో మూడు రోజుల్లో లక్ష కొవిడ్ వ్యాక్సిన్ డోసులు వైద్య సిబ్బందికి వేయాల్సి ఉంది. కానీ మూడు రోజుల్లో కేవలం 47,020 మంది మాత్రమే కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. మిగతావాళ్లంతా తాము ఇంటి వద్ద లేమని, ఆరోగ్యం బాగోలేదని తప్పించుకున్నారు. తొలిరోజు ప్రపంచ రికార్డు బద్దలు కొట్టామని కేంద్ర ప్రభుత్వం చెప్పుకుంటున్నా.. క్షేత్ర స్థాయిలో మాత్రం వ్యాక్సిన్ వేయించుకోడానికి వైద్య సిబ్బంది వెనకాడ్డం విశేషం. వైద్య సిబ్బందే వ్యాక్సిన్ కు వెనకాడుతుంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి..?

    ఆరోగ్య సిబ్బందిలోనూ అనుమానం..

    కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోడానికి ఆరోగ్య సిబ్బంది భయపడుతున్నట్టు అర్థమవుతోంది. ఏపీతో సహా మిగతా అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమోనన్న భయం ఓవైపు, కరోనా హడావిడి తగ్గిన ఈ రోజుల్లో ఇంకా వ్యాక్సిన్ ఎందుకనే ఆలోచన మరోవైపు.. వెరసి.. వ్యాక్సినేషన్ కు వైద్య సిబ్బంది దూరంగా ఉండిపోతున్నారు.

    టీకాపై తగ్గిన ఆసక్తి..

    కరోనా వచ్చిన కొత్తల్లో అందరి ఆలోచన టీకాపైనే ఉంది. ఏయే దేశాల్లో టీకా తయారు చేస్తున్నారు, ఏయే కంపెనీలు పని మొదలు పెట్టాయి, ఎవరి టీకా ఎప్పుడు మార్కెట్లోకి వస్తుంది? ఎంత రేటుంటుంది..? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ ఆసక్తిగా సమాధానాలు వెదికారు జనాలు. అయితే తీరా టీకా వచ్చే సరికి అందరిలో ఆ ఆసక్తి తగ్గిపోయింది. కరోనా కేసులు, మరణాలు రోజు రోజుకి తగ్గిపోతుండటం, సాధారణ జనజీవనం తిరిగి ప్రారంభం కావడంతో జనాల్లో ఆ వ్యాధి పట్ల భయం పోయింది. దీంతో సహజంగానే అందరూ టీకా విషయాన్ని లైట్ తీసుకున్నారు. ఇక ప్రయోగ దశలు పూర్తి కాకుండానే టీకాకు భారత్ అనుమతి ఇవ్వడం మరో కారణం, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమోనన్న అనుమానం కూడా వైద్య సిబ్బందిలో ఉంది. అందుకే చాలామంది వ్యాక్సినేషన్ కు వెనకడుగేస్తున్నారు.

    ఇవీ లెక్కలు..

    శనివారంనుండి భారత్ లో కరోనా వ్యాక్సినేషన్ మొదలైంది. గడచిన మూడు రోజుల్లో ఏపీలో మొత్తం 47,020మంది టీకా తీసుకున్నారు. వాస్తవంగా మూడు రోజుల్లో లక్షమంది వైద్య సిబ్బందికి టీకా వేయాలనేది ప్రభుత్వ టార్గెట్. కానీ ఏపీలో 43.4శాతం మంది వైద్య సిబ్బంది వ్యాక్సినేషన్ కి హాజరు కాకుండా ఇంటిపట్టునే ఉండిపోయారు. ఎవరికి వారే టీకా తీసుకోడానికి వెనకగుడేస్తుండే సరికి వ్యాక్సినేషన్ కార్యక్రమం నత్తనడకన సాగుతోంది. మరోవైపు కొవిడ్ టీకా తీసుకున్న తర్వాత ఉత్తర ప్రదేశ్ లో ఒకరు, కర్నాటకలో ఒకరు మృతి చెందడంతో కలకలం రేగింది. అయితే ఈ మరణాలకు టీకా కారణం కాదని అధికారులు చెబుతున్నారు.

    అప్పుడే రెండో విడత..

    తొలి విడత డోసులు పూర్తి కాకముందే.. ఏపీకి రెండో విడత కరోనా టీకాలు చేరుకున్నాయి. కేంద్రం పంపిన 4,08,500 డోసులను రిసీవ్ చేసుకుని జిల్లాలకు అధికారులు పంపుతున్నారు. లి విడతలో 4.99 లక్షల కరోనా డోసులను ఏపీకి కేంద్రం పంపగా రెండో విడతలో 4.08లక్షల డోసులు అందాయి.