మృత్యువు ఏ రూపంలో ఎవరిని ఎప్పుడు కబళిస్తుందో తెలియదు. అయితే కొన్నిసార్లు మరణానికి ముందు వారు చివరిసారిగా చేసిన పనులు.. మృత్యువు సమాచారాన్ని ముందుగానే చెప్పాయా అనిపిస్తంది. సరిగ్గా చనిపోవడానికి కొన్నిగంటల ముందు భార్య, పిల్లలతో వీడియో కాల్ మాట్లాడాడు చిత్తూరు జిల్లా కురుబలకోట మండలం ఎగువరేగడ జిల్లావాసి సాయితేజ.
” పాప దర్శిని ఏం చేస్తోంది.. మోక్షజ్ఞ స్కూల్ కు వెళ్లాడా.. చిట్టితల్లిని చూడాలని ఉంది. వీడియో కాల్ చేస్తా” అంటూ భార్య శ్యామలతో లాన్స్ నాయక్ బి.సాయితేజ బుధవారం ఉదయం 8.45 గంటలకు మాట్లాడారు. భార్య, పాపను వీడియోకాల్లో చూస్తూ తాను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్తో కలిసి తమిళనాడు వెళుతున్నానని.. వీలు కుదిరితే సాయంత్రం చేస్తానని టాటా చెప్పిన సాయితేజ.. ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వీడియో కాల్ లో కూతురిని చివరిసారిగా ముద్దాడాడు సాయితేజ.
సిపాయిగా ఎంపికై.. లాన్స్ నాయక్ స్థాయికి..
28 ఏళ్ల సాయితేజ 2013లో బెంగళూరు రెజిమెంట్ కు ఆర్మీ సిపాయిగా ఎంపికయ్యారు. అక్కడ శిక్షణ పొందుతూ డిపార్ట్మెంట్కు సంబంధించిన పరీక్షలు రాసి ఏడాది తర్వాత పారా కమాండోగా ఎంపికై 11వ పారాలో లాన్స్ నాయక్ గా నియమితులయ్యారు. విధి నిర్వహణలో భాగంగా కశ్మీర్, బెంగళూరు హెడ్క్వార్టర్స్లో పనిచేశారు. ప్రస్తుతం ఢిల్లీలోబిపిన్ రావత్ వద్ద పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. తల్లి భువనేశ్వరి మాజీ ఎంపీటీసీ, తండ్రి మోహన్ సాధారణ రైతు. తమ్ముడు మహేష్ఆర్మీలో సిపాయిగా సిక్కింలో పని చేస్తున్నారు.
సాయితేజకు 2016లో శ్యామలతో వివాహం జరిగింది. వీరికి కుమారుడు మోక్షజ్ఞ (5), పాప దర్శిని (2) సంతానం. కుమారుడు మోక్షజ్ఞ చదువు కోసం సాయితేజ భార్య శ్యామల మదనపల్లె ఎస్బీఐ కాలనీ రోడ్ నెం.3లో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. సాయితేజ చివరిగా సెప్టెంబర్లో వినాయక చవితికి స్వస్థలానికి వచ్చి వెళ్లారు.