మైసూరు జిల్లాలో పరస్పర ఆరోపణలు చేసుకునీ మీడియా సాక్షిగా వీధిన పడ్డ ఇద్దరు ఐఏఎస్ అధికారుల్ని ప్రభుత్వం బదిలీ చేసింది. మైసూరు జిల్లా కలెక్టర్ రోహిణి సింధూరి, కమిషనర్ శిల్పా నాగ్ లు పరస్పర విమర్శల పర్వంతో బజారుకెక్కారు. కలెక్టర్ రోహిణి సింధూరి వ్యవహార శైలి తనకు నచ్చడంలేదని, ఆమె ఉండగా తాను పనిచేయలేనంటూ కమిషనర్ శిల్పానాగ్ ఇటీవల మీడియా సమావేశంలో తీవ్ర విమర్శలు చేశారు. తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. దీనిపై ఎంక్వయిరీ వేసిన ఉన్నతాధికారులు ఇద్దరి తీరుని తప్పుబట్టారు. బదిలీవేటు వేశారు. రోహిణి సింధూరిని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ గా బదిలీ చేశారు. శిల్పా నాగ్ ని గ్రామీణాభివృద్ధి– పంచాయతీ రాజ్ శాఖలో ఈ గవర్నెన్స్ డైరెక్టర్ గా నియమించారు.
రోహిణి సింధూరి బెంగళూరులో సీఎం యడియూరప్పను కలిసి తన బదిలీని రద్దు చేయాలని కోరగా, ఆయన తిరస్కరించినట్లు తెలిసింది. రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన శిల్పానాగ్, మనసు మార్చుకుని కొత్త పోస్టులో చేరుతున్నట్లు తెలిపారు.
మైసూరు జిల్లా నూతన కలెక్టర్గా డా.బగాది గౌతమ్, కార్పొరేషన్ కమిషనర్గా జి.లక్ష్మీకాంత్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది.