సహజంగా టీనేజ్ అమ్మాయిలకు స్కార్ఫ్ కట్టుకునే అలవాటు ఉంటుంది. పోనీ మొహానికి కట్టుకోకపోయినా సరదాగా మెడలో వేసుకుంటారు. చున్నీల స్థానంలో ఇప్పుడు చాలామంది స్కార్ఫ్ నే మల్టీ పర్పస్ గా వాడుతున్నారు. అయితే స్కార్ఫ్ తో జర జాగ్రత్త. ముఖ్యంగా బైక్ పై వెళ్లేటప్పుడు ఏమాత్రం తేడా వచ్చినా మీ ప్రాణాలే పోతాయి. దానికి తాజా ఉదాహరణ యానాంలో బయటపడింది.
ఆనందంగా ఫంక్షన్కు హాజరయ్యేందుకు బైక్పై వెళుతున్న ఆ కుటుంబాన్ని స్కార్ఫ్ రూపంలో ప్రమాదం వెంటాడింది. ఆ మహిళ ధరించిన స్కార్ఫ్ బైక్ వెనుక చక్రంలో చిక్కుకు పోవడంతో ఆమె కింద పడటంతో తలకు తీవ్రగాయాలై మృతిచెందింది. తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలం పల్లంకు చెందిన దంపతులు పాలెపు లక్ష్మణ్, పాలెపు దుర్గ (25) యానాం శివారు సావిత్రినగర్లో బంధువుల ఇంటిలో ఫంక్షన్కు హాజరయ్యేందుకు బైక్ పై తమ మూడేళ్ల కుమారైతో వెళ్తున్నారు. దారిలో దొమ్మేటిపేట ఇసుక కాలువ వద్దకు వచ్చేసరికి దుర్గ ముఖానికి కట్టుకున్న స్కార్ఫ్ బైక్ వెనుక చక్రంలో చిక్కుకుపోయింది. దీంతో బైక్ అదుపుతప్పి ఆమె రోడ్డుపై పడిపోయింది. తలకు తీవ్రగాయమై అపస్మారక స్థితికి చేరిన ఆమెను స్థానికులు యానాం జీజీహెచ్కు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్కు తరలించగా అక్కడ చికిత్సపొందుతూ దుర్గ మృతిచెందింది. భర్త లక్ష్మణ్కు, కుమారైకు స్వల్ప గాయాలయ్యాయి.